సిటీబ్యూరో, మే 23(నమస్తే తెలంగాణ): జూన్ 7వ తేదీలోగా విద్యార్థుల స్కూల్ యూనిఫాం స్టిచ్చింగ్ ప్రక్రియ పూర్తి కావాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఏకరూప దుస్తులను నిర్ణీత సమయంలోగా అందించడానికి స్వయం సహాయక బృందాలకు పని అప్పగించామన్నారు. హైదరాబాద్ జిల్లాలో 768 పాఠశాలల్లోని 1,34,476 మంది విద్యార్థులకు యూనిఫాం అందించాల్సి ఉందని తెలిపారు. దుస్తుల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫాం అందేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి కె.రోహిణి, జీహెచ్ఎంసీ యూసీడీ అడిషనల్ కమిషనర్ సి.చంద్రకాంత్, జాయింట్ కమిషనర్ ఎస్.వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
జూన్ 9వ తేదీన నిర్వహించనున్న గ్రూప్-1 సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లో 77 సెంటర్లు ఏర్పాటు చేశామని, 40,569 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, పరీక్ష ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని చెప్పారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించడానికి 11 మంది రూట్ ఆఫీసర్లు, 5 మంది రీజినల్ కోఆర్డినేటర్లు, 77 మంది ఇతర అధికారులు, 16 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు నియమించినట్లు తెలిపారు. దివ్యాంగులు, అంధ విద్యార్థుల కోసం స్కైబ్స్ను, గుర్తింపు కార్డును చూసి అనుమతించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, డీఆర్ఓ వెంకటాచారి, జాయింట్ కస్టడియన్స్ కె.వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.