సుల్తాన్బజార్, ఏప్రిల్ 28 : ఉస్మానియా దవాఖాన ఎదురుగా ఉన్న ఫుట్పాత్పై నిద్రిస్తున్న యాచకురాలి రెండు నెలల కూతురు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. 24 గంటల్లో రైల్వే పోలీసుల సహకారంతో అఫ్జల్గంజ్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి చిన్నారిని తల్లి చెంతకు చేర్చారు. అఫ్జల్గంజ్ పోలీసుల కథనం ప్రకారం.. ఉస్మానియా దవాఖాన వద్ద ఉన్న ఫుట్పాత్పై స్వాతి అనే మహిళ తన రెండు నెలల కూతురు అమ్ములుతో కలిసి యాచకురాలిగా జీవనం సాగిస్తున్నది. కాగా మహారాష్ట్రకు చెందిన జ్యోతి(30), జార్ఘండ్ రాష్ర్టానికి చెందిన వికాస్కుమార్(19) గత కొంత కాలంగా స్వాతితో చనువుగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి స్వాతి బాత్రూంకు వెళ్లిన సమయంలో చిన్నారిని తీసుకుని పరారయ్యారు. దీంతో స్వాతి వెంటనే అఫ్జల్గంజ్ పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. సీసీ పుటేజీల ఆధారంగా గుర్తించిన ఉప్పుగూడ రైల్వే పోలీసులు అఫ్జల్గంజ్ పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను అదుపులోకి తీసుకొని చిన్నారిని తల్లికి అప్పగించారు.