చార్మినార్ : ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాల్ నగర్లో నివసించే అబ్థుల్ ఖరీం (40) ఫుట్పాత్ పై వ్యాపారం నిర్వహిస్తుంటాడు.
సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులకు ఎలాంటి సమచారం ఇవ్వకుండా బయటకు వెళ్లాడు. రోజు వారి తన విధులకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు భావించారు. తిరిగి ఇంటికి చేరాల్సిన సమయం మించిపోయినా అబ్థుల్ ఖరీం రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించారు.
స్విఛ్చాఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల వద్ద గాలించినా ఎలాంటి ప్రయోజనం లేక పోవడంతో అతని భార్య షమీన్బేగం వెంటనే పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభిస్తున్నామని ఎస్సై లవన్కుమార్ తెలిపారు.
మరో ఘటనలో..
పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాసీం (66) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నాడు. సోమవారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఇంటి నుండి బయటకు వెళ్లాడు. మహ్మద్ ఖాసీం ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు స్థానిక ప్రాంతాల్లో గాలించారు.
ఎలాంటి సమాచారం లభించక పోవడంతో ఆందోళనకు గురైన మహమద్ ఖాసీం భార్య పర్వీన్ బేగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించామని ఏ ఎస్సై నయీం తెలిపారు.