సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): గోవా, ముంబై తరువాత డ్రగ్ మాఫియా బెంగళూర్ను కేంద్రంగా చేసుకున్నట్లు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీన్యాబ్) గుర్తించింది. బెంగళూర్ నుంచి కూడా హైదరాబాద్కు ఈ మాఫియా తమ నెట్వర్క్ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ నెట్వర్క్ను పూర్తిగా ధ్వంసం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల అరెస్టయిన మ్యాక్స్వెల్కు చెందిన నైజీరియన్ ముఠాతో హైదరాబాద్లో ఉన్న వారి లింక్లపై దృష్టి పెట్టింది. ప్రాథమికంగా 8 మంది లింక్లను టీ న్యాబ్ గుర్తించినట్లు తెలిసింది. హోల్సెల్లో మ్యాక్స్వెల్ డ్రగ్స్ దందా నిర్వహించడంతో అతడి నెట్వర్క్లో ఉన్న వారందరు పెద్ద మొత్తంలోనే డ్రగ్స్ కొని, వాటిని నేరుగా వినియోగదారులకు , చిన్న చిన్న పెడ్లర్లకు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం 8 మందితో ఉన్న లింక్లను పోలీసులు వెలుగులోకి తేనున్నారు.
నైజీరియా నుంచి వచ్చి ముంబైతో పాటు బెంగళూర్లో డ్రగ్స్ దందా నిర్వహించిన మ్యాక్స్వెల్ 11 ఏండ్లుగా తన సొంత సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతడి లాంటి వాళ్లు చాలా మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి దందా నిర్వహించే వాళ్లు తమ పాస్పోర్టు, వీసాల గడువు పూర్తయినా.. అక్రమంగా దేశంలో తిష్టవేసి అక్రమ దందాలు నిర్వహిస్తుంటారు. హైదరాబాద్ పోలీసులు హెచ్న్యూ ఏర్పాటు చేసిన తరువాత గోవా, ముంబై నెట్వర్క్లను ఛేదించారు. సిటీ పోలీసులు గోవాపై ఫోకస్ పెట్టిన సమయంలో అక్కడున్న వాళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో గోవా, ముంబైకి చెందిన డ్రగ్ స్మగ్లర్లు తమ మకాంను బెంగళూర్కు మార్చారు.
తెలంగాణ పోలీసులు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో హైదరాబాద్తో లింక్లు లేకుండా డ్రగ్ ముఠాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే, కొందరు మాత్రం లింక్లు కొనసాగిస్తూ.. పోలీసులకు చిక్కకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అజ్ఞాతంలో ఉంటున్నారు. ఇప్పుడు టీన్యాబ్ దృష్టి బెంగళూర్పై పడింది. దీంతో అక్కడ ఉండే డ్రగ్స్ నేరగాళ్లలో వణుకు మొదలయ్యింది. టీన్యాబ్ అధికారులు ఇప్పటికే బెంగళూర్పై దృష్టిపెట్టి, ముఠాలను అరెస్ట్ చేస్తున్నారు. త్వరలోనే అక్కడి నుంచి మరిన్ని అరెస్ట్లు ఉండే అవకాశాలున్నాయి.