తెలుగు యాస, భాషల వెక్కిరింత.. కట్టు, బొట్టుపై ఆంక్షలు.. సంస్కృతి, సంప్రదాయాలపై చిన్నచూపు. ఇది నాటి నిజాం పరిపాలనలో తెలుగు వారి దుస్థితి. నాటి పరిపాలనలో కొడిగట్టుకుపోతున్న తెలుగు భాషా దీపాన్ని పరిరక్షించుకునేందుకు ఎంతో మంది మహనీయులు ఉద్యమించారు. అందునా తెలంగాణ గడ్డపై నుంచి నడిపిన ఉద్యమాలు మరింత ప్రత్యేకమైనవి. ప్రభుత్వ అణిచివేత, నిర్భందాలకు వెరవకుండా పక్కా ప్రణాళికలతో తెలుగు భాషా, సంస్కృతుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడారు. సాహితీ సమ్మేళనాలు, సదస్సుల నిర్వహణతో ప్రజల్ని మేల్కొల్పి తెలుగు భాషా పూర్వ వైభవానికి నిజాం రాష్ర్టాంధ్ర సారస్వత పరిషత్తును ఏర్పాటు చేసి మాతృ భాషాభివృద్ధికి బంగారు బాటలు వేశారు.
తెలుగు యూనివర్సిటీ, మే 25 : తెలుగు భాషా, సంస్కృతుల పరిరక్షణ కోసం 80 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ సారస్వత పరిషత్తు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. 1921 హైదరాబాద్ వివేకవర్ధినిలో కార్వే పండితుని ఆధ్వర్యంలో సాహితీ సంస్కరణ సభలు జరుగుతున్న సందర్భంలో న్యాయవాది ఆలంపల్లి వెంకటరామారావు తెలుగు భాషలో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు జరిగిన అవమానంలో నుంచి ఉదయించిన ఈ సంస్థ నేడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వేదికగా నిలిచింది.
భాషా పరిరక్షణ, పరివ్యాప్తికోసం తెలంగాణ ఆంధ్రోద్యమం, ఆంధ్ర జనసంఘం సంస్థలు నెలకొల్పబడడంతో పాటు తొమ్మిది ప్రాంతాల్లో ఆంధ్రమహా సభలు నిర్వహించారు. రాను రాను అవి రాజకీయ వేదికలుగా మారి.. భాషా సంస్కృతుల ప్రస్థావన లేకపోవడంతో నాటి పెద్దలు తీవ్రంగా ఆలోచించి..నిజాం రాష్ర్టాంధ్ర సారస్వత పరిషత్తును 1943 మే 26న హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో జరిగిన దశమాంధ్ర మహాసభలలో నెలకొల్పారు.
మాతృభాష కోసం పరితపించిన మాడపాటి హనుమంతరావు, లోకనంది శంకర నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి, భాస్కరభట్ల కృష్ణారావు, బూర్గుల రామకృష్ణారావు, రంగనాథరావు తదితర ప్రముఖులు నిజాం పరిపాలనలో కొడిగట్టుకుపోతున్న తెలుగు భాషా దీపాన్ని పరిరక్షించుకునేందుకు ప్రణాళికలు చేపట్టి నిర్భందాలకు వెరవకుండా కార్యక్రమాలు కొనసాగించారు. 1949 ఫిబ్రవరి 4,5,6 తేదీల్లో తూఫ్రాన్లో జరిగిన సారస్వత పరిషత్తు రాష్ట్ర మహాసభల్లో తెలుగు ప్రముఖులంతా హాజరై మెట్రిక్ వరకు మాతృభాషలోనే విద్యాభ్యాసం జరగాలని తీర్మానించి ఇంటర్ డిగ్రీ స్థాయిలో తెలుగు భాష ఒక అధ్యయనాంశంగా ఉండాలని నిర్ణయించారు.
తెలుగు ఉపాధ్యాయులు లేని కాలంలో అప్పటి ప్రభుత్వం అంగీకరించిన విధంగా పరిషత్తు నిర్వహించిన తెలుగు బోధన చేపట్టి పరీక్షలు నిర్వహించి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఘనత సారస్వత పరిషత్తుకే దక్కింది. తెలుగు ప్రాంతాలతో పాటు ముంబై, మద్రాసు, మైసూర్తో పాటు మారిషస్, మలేషియా వంటి దేశాలలో కూడా విస్తరించి భాషా, సాహిత్య వికాసం కోసం పరిషత్తు కృషి చేసిన సందర్భాలు అనేకం. గ్రంథాల ముద్రణతో పాటు కవి, పండితుల రచనల ఆవిష్కరణలు, సాహిత్యంలో విభిన్న ధోరణులపై అద్భుత ప్రసంగాలు, సదస్సులు కొనసాగించింది. లోకనంది శంకర్ నారాయణరావు అధ్యక్షతన ప్రారంభమైన పరిషత్తు సురవరం ప్రతాపరెడ్డి, రామచంద్రరావు, పర్సా వెంకటేశ్వరరావు, డాక్టర్ దేవులపల్లి రామానుజరావు, నూకల నరోత్తమరెడ్డి, డాక్టర్ సి. నారాయణ రెడ్డి వంటి పెద్దలు పరిషత్తుకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంలో మన సంస్కృతి, సంప్రదాయాలకు పాటుపడిన నాటి పోరాట స్ఫూర్తిని మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలంగాణ సారస్వత పరిషత్తుగా మారింది. ప్రభుత్వ సౌజన్యంతో హైదరాబాద్తో పాటు తెలంగాణ అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తెలంగాణ సాహిత్య వికాసానికి సంబంధించిన పలు గ్రంథాల ముద్రణ, 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, పురాతన కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, క్రీడలు మొదలైన అంశాలపై సమగ్ర గ్రంథాలు వెలువరించే కార్యక్రమాలకు పరిషత్తు శ్రీకారం చుట్టింది. అరవై ఏండ్లు దాటిన ప్రముఖులైన సాహితీవేత్తల అనుభవాలతో కూడిన ప్రసంగాలు, రచయితల సభలు, బాల సాహిత్య సమ్మేళనాలు, తెలుగు ఉపాధ్యాయుల సదస్సులు, వచన కవిత, విమర్శ, నాటకం మొదలైన అంశాలపై అధ్యయన శిబిరాల నిర్వహణను చేపట్టింది. ప్రత్యేకించి తెలంగాణ కవులు, రచయితల కోసం ఉత్తమ గ్రంథాల పోటీలు, పురస్కారాల ప్రదానోత్సవం వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ భాషా సాహిత్యాలను, సంస్కృతిని భావితరాలకు అందించేలా ఎనిమిది దశాబ్దాలుగా అవిరళ కృషిని కొనసాగిస్తున్నది.
తెలుగు భాషా, సాహిత్యాల అభివృద్ధి కోసమే మాడపాటి హనుమంతరావు 1943లోనే స్థాపించారు. ఆంధ్రమహాసభ ఉన్నప్పటికీ లక్ష్యం నెరవేరకపోవడంతో సాహిత్యం, భాష కోసం పరిషత్తును ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రాధాన్యత తగ్గినా దేవుపల్లి రామానుజరావు, సినారే కృషి వల్ల గొప్ప సంస్థగా ఎదిగింది. తెలుగు భాషకు, రచనలకు పరిషత్తు ప్రాధాన్యమిచ్చింది. 33 జిల్లాల సమగ్ర స్వరూపంతో కూడిన పుస్తకాలను తీసుకువచ్చే కృషిని పరిషత్తు చేపట్టడం గొప్ప పరిణామం.
– డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి, ప్రఖ్యాత రచయిత్రి
తెలంగాణ సామాజిక వాతావరణంతోనే పరిషత్తు ఏర్పడింది. నిజాం కాలంలో తెలుగు ప్రజలు బానిస జీవనం గడుపుతున్న తరుణంలో రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి సహకారంతో సురవరం ప్రతాపరెడ్డి సారథ్యంలో మాడపాటి హనుమంతరావు తదితర ప్రముఖులు ఒక సంస్థను నెలకొల్పాలని రెడ్డి హాస్టల్ నిర్ణయించుకుని నిజాం రాష్ర్టాంధ్ర సారస్వత పరిషత్తుగా ఏర్పాటు చేశారు. తెలుగు సాహిత్యం తెలుగులోనే ఉండాలని గోలకొండ పత్రికను సురవరం ప్రతాపరెడ్డి ఏర్పాటు చేశారు. దేవులపల్లి రామానుజరావు సారథ్యంలో సాగిన సభల అనంతరం రచయితలను ప్రోత్సహించారు. తెలుగులో పరీక్షలు నిర్వహించి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన గొప్ప సంస్థ సారస్వత పరిషత్తు. అనంతర కాలంలో పరిషత్తుకు స్థలం సొంతం అయ్యేలా డాక్టర్ సినారే చేసిన కృషి ప్రత్యేకమైందిగా చెప్పవచ్చు. పరిషత్తు స్థాపించిన పెద్దల దారిలో నడుస్తూ ఆధునిక సాహిత్యంలో వచ్చిన పరిణామాలకు అనుగుణంగా సదస్సుల నిర్వహణ, రచయితలకు పురస్కారాలు, బాల సాహిత్యంలో విలువలు పెంపు దిశగా కొత్తగా ముందుకు సాగుతున్నాం. పరిషత్తును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వంతో పాటు దాతల తోడ్పాటు కూడా గొప్పగా ఉంది.
– ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, పరిషత్తు అధ్యక్షుడు
ఒక సాహితీ సంస్థ స్వచ్ఛందంగా 80 ఏళ్లు ప్రయాణం సాగించే సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయి. రెండు తెలుగు రాష్ర్టాల్లో కూడా ఇలాంటి సాహిత్య సేవా సంస్థ ఎక్కడా లేకపోవచ్చు. తెలుగు పండితులను, అధ్యాపకులను ప్రాచ్య కళాశాల ద్వారా తీర్చిదిద్దింది. తెలుగు సాహిత్యంలోని లబ్దప్రతిష్ఠులు కాళోజీ, సురవరం ప్రతాప రెడ్డి, దాశరథి, పీవీ నరసింహారావు, సినారే వంటి వారు అనేక సదస్సులలో పాల్గొని ప్రసంగించిన సందర్భాలు అనేకం. రాష్ట్ర ప్రభుత్వం, దాతలు సహకరిస్తూ సమాజం ఉన్నతికి కృషి చేస్తూ పరిషత్తుకు తగు తోడ్పాటును అందించడం హర్షించదగిన విషయం. తెలుగు సాహిత్యంలో అజరామరంగా నిలిచిన వారి చరిత్రను గ్రంథాల్లో నిక్షిప్తం చేయడం ద్వారా భావితరాలకు ఎంతో మేలు జరుగుతుంది.
– జూలూరు గౌరీశంకర్, సాహిత్య అకాడమీ చైర్మన్
80 ఏండ్లుగా సాహిత్య చరిత్ర కలిగిన గొప్ప సంస్థ సారస్వత పరిషత్తు. నిజాం కాలంలో తెలుగు భాషను ఉచ్చరించడమే నేరంగా భావించే రోజుల్లో భాషా పరిరక్షణ కోసం నెలకొల్పబడిన సాహిత్య, సాంస్కృతిక సంస్థ నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను ప్రోత్సహిస్తూ రచయితల, రచయిత్రుల పుస్తకాలను ముద్రించి పురస్కారాలు అందిస్తూ తోడ్పాటును అందించడం ఎంతో గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఎనభై ఏళ్లుగా సాహిత్య సేవ చేస్తున్న ఈ సంస్థను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– అమ్మంగి వేణుగోపాల్, ప్రముఖ రచయిత