సిటీబ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులే స్వీపర్లు పేరుతో ‘నమస్తే ’ ప్రచురించిన కథనాన్ని తెలంగాణ హెచ్ఆర్సీ బుధవారం సుమోటోగా స్వీకరించింది. విద్యార్థులను చదువుకు దూరం చేసేలా చెత్త ఊడిపించడం, మెట్లు కడిగించడం, తట్ట ఎత్తించడం తదితర వాటిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్ల వివరాలు, విద్యార్థులతో పనులు చేయించిన వ్యక్తులపై తీసుకున్న చర్యలు తదితర అంశాలతో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారినిలకు హెచ్ఆర్సీ సభ్యురాలు శివాడి ప్రవీణ ఆదేశించించారు.
ప్రభుత్వ పాఠశాలలో పిల్లల హక్కులు, వారి రక్షణకు తీసుకుంటున్న చర్యలతో కూడిన సమగ్ర నివేదికను ఈనెల 24న సమర్పించాలని పేర్కొంది. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్లు ఏర్పాటు చేసుకోవాలని పాఠశాలలకు ఇప్పటికే నిధులిచ్చినట్టు డీఈఓ రోహిణి తెలిపారు. ఓయూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయించడంపై సమగ్రవిచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.