కుత్బుల్లాపూర్, మే 22: ‘రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 18 జాబ్మేళాలను నిర్వహించింది. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి 30,902 మందికి ఉద్యోగాలు ఇప్పించాం. తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ (టీఎస్-స్టెప్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాబ్మేళాల ద్వారా ఐటీ, బీపీఓ, ఫార్మా వంటి రంగాల్లో అర్హులు చేరుతున్నారు. నెలకు పదివేల నుంచి 80 వేల రూపాయల వరకు వేతనాలు పొందుతున్నారు. ఇదే క్రమంలో 50వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా త్వరలోనే హైదరాబాద్ నగరంలో మెగా జాబ్మేళా నిర్వహిస్తాం’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం కుత్బుల్లాపూర్ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన జాబ్మేళాను మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఇటువంటి మేళాలు నిరుద్యోగులకు సువర్ణవకాశం లాంటివని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే దిశగా కుత్బుల్లాపూర్లో ఒకే రోజు ఏకంగా 118 కంపెనీలతో జాబ్మేళా నిర్వహించామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు.
కుత్బుల్లాపూర్, మే 22 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి యావత్ ప్రపంచ స్థాయి కార్పొరేట్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖమంత్రి కేటీఆర్ల సహకారం, కృషి ఎంతో ఉన్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, కుత్బుల్లాపూర్ శాసన సభ్యులు కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ స్టేట్ సొసైటి ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్(టీఎస్-స్టెప్) నేతృత్వంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సహకారంతో కుత్బుల్లాపూర్ మున్సిపల్ మైదానంలో సోమవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళాకు మంత్రులు హాజరై జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 18 జాబ్మేళాల ద్వారా 30,902 మందికి ఉద్యోగాలు కల్పించామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. త్వరలోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా టీఎస్-స్టెప్ నేతృత్వంలో ఇదే తరహాలో మెగా జాబ్మేళా నిర్వహించి ఒకేసారి 50వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్ కృషితో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. సాఫ్ట్వేర్, బీపీఓ, ఫార్మా, రిటైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో నిరుద్యోగ యువతకు వారి అర్హతలకు తగ్గట్టుగా ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 18 జాబ్మేళాలో 97వేల 19మంది నిరుద్యోగ యువత టీఎస్ స్టెప్కు దరఖాస్తు చేసుకోగా.. 30,902 మందిని ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి వివిధ సంస్థల్లో ఉద్యోగాలను కల్పించి నియామకపత్రాలను అందించామన్నారు. వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన వారికి కనిష్ఠంగా నెలకు రూ.10వేల నుంచి గరిష్ఠంగా రూ.80వేల వరకు వేతనాలు అందుతున్నాయన్నారు.
– భరోసానిచ్చిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశం కల్పించే దిశగా మెగా జాబ్మేళాను నిర్వహించినట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ జాబ్మేళాలలో 118 కంపెనీలు పాల్గొన్నట్లు తెలిపారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని భవిష్యత్లో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు యువత ముందుకు రావాలన్నారు. ఇదే స్ఫూర్తితో కాలానికి అనుగుణంగా పోటీతత్వాన్ని పెంపొందించుకొని ఆయా రంగాల్లో స్థిరపడాలని, ఆసక్తి గల నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ ఎండీ వేణుగోపాల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ మున్సిపల్ మైదానంలో సోమవారం నిర్వహించిన జాబ్మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. ఈ జాబ్మేళాలో 118కి పైగా కంపెనీలు పాల్గొనగా 4725 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇందులో 269 మందికి సత్వర ఉద్యోగాలు కల్పించగా, మరో 1458 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. కాగా వీరిలో ఇద్దరు ట్రాన్స్జెండర్లు, ముగ్గురు వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు లభించడం విశేషం.
– కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి
జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగులకు సువర్ణవకాశం కల్పిస్తున్నామని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. చదువు పూర్తైన తర్వాత సమయాన్ని వృథా చేయకుండా ఉద్యోగంలో స్థిరపడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని నిరంతరం శ్రమించాలని తెలిపారు. అరచేతిలో సెల్ఫోన్ రూపంలో ప్రపంచం మన చేతిలో ఉన్నదని, దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. నేటి యువత జీవితంలో స్థిరపడి నలుగురికి ఉపాధి కల్పించేందుకు కొత్తకొత్త కంపెనీలను స్థాపించాలని, పబ్బులు, పార్కులు, రెస్టారెంట్లు తిరిగి సమయం వృథా చేసుకోవద్దన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఇంత పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు ఉజ్వళభవిష్యత్ను అందించేందుకు సీఎం కేసీఆర్ బాటలు వేశారని అన్నారు.