మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 12 : పీఎం విశ్వకర్మ స్కీమ్తో అంతరించి పోతున్న చేతి వృత్తుల వారికి చేయూత లభిస్తుందని, దీంతో చేతి వృత్తి దారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో జిల్లాలోని బ్యాంకర్లు, అధికారులతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్లు అర్హులైన విద్యార్థులకు రుణాలు అందించాలని అన్నారు. పీఎం స్కీమ్తో 18 రకాల చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందుతుందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి వార్షిక లక్ష్యం రూ.18,370 కోట్లు కాగా రూ.44,287 కోట్లు మంజూరు చేసి 241 శాతంతో లక్ష్యాన్ని అధిగమించారని అన్నారు. లక్ష్య సాధనలో వెనుకబడిన బ్యాంకర్లు తమ పనితీరును మెరుగు పర్చుకోవాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పరిశ్రమలు, డీఆర్డీఓ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకులు ఉపాధి యూనిట్ల స్థాపన, చిన్న, మధ్య తరహా, విద్య, గృహ నిర్మాణం ఇతర ప్రాధ్యాన్నత రంగాలకు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయించాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే విధంగా బ్యాంకర్లు సంబంధిత అధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆర్థిక అక్షరాస్యత, నగదు రహిత డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కెనరా బ్యాంక్ డీజీఎం సంజయ్ కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసులు, ఆర్బీఐ ఎల్డీఓ గోమతి, నాబార్డు అధికారి రమేశ్, జీఎండీఐసీ రవీందర్, జిల్లా వ్యవసాయాధికారి మేరి రేఖ, డీఆర్డీఓ పద్మజారాణి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.