మణికొండ ( హైదరాబాద్ ) : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చారిత్రాత్మక గండిపేట జలాశయం నిండుకుండలా మారింది. జలాశయ గరిష్ట నీటి మట్టం 1790 అడుగులు ఉండగా ప్రస్తుతం 1787.15కు నీటిమట్టం పెరగడంతో బుధవారం జలమండలి అధికారులు, స్థానిక ఎమ్మెల్యేప్రకాష్గౌడ్ చేతుల మీదుగా రెండు గేట్లను ఎత్తివేశారు.
వికారాబాద్, శంకర్పల్లి, జన్వాడ గ్రామాల మీదుగా నీటి ప్రవాహం ఉధృతంగా వస్తుండటంతో జలాశయం నిండేందుకు మూడు అడుగులు ఉండగానే ముందస్తు చర్యలలో భాగంగా రెండు గేట్లను ఎత్తి 216 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలినట్లు డీజీయం నరహరి తెలిపారు. గేట్లు ఎత్తి ముందు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి బుధవారం మధ్యాహ్నం రెండు గేట్లను ఎత్తారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్, ఆర్డీవో మల్లయ్య, డీసీపీ జగదీశ్వర్రెడ్డి, జలమండలిశాఖ అధికారులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లను ఎత్తించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తాగు, సాగు నీటికి ఢోకా లేకుండా వర్షాలు పుష్కలంగా పడుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేసి నిస్వార్థంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్దికి వరణుడు కరుణించి దీవిస్తున్నాడని ఎమ్మెల్యే తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనంతగా సుబిక్షంగా వర్షాలు కురుస్తున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.