హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయానికి భారీగా వరదనీరు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 884.85 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలకు ప్రస్తుతం 214.36 టీఎంసీల నీరున్నది.
ఎగువ నుంచి 1,73,695 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు జలాశయం ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 71,005 క్యూసెక్కుల అవుట్ఫ్లోగా నమోదైంది. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులకుపైగా వరద చేరే అవకాశం ఉండటంతో అధికారులు 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
వనపర్తి జిల్లా మదనాపురంలోని సరళాసాగర్ ప్రాజెక్టు ఆటోమెటిక్ సైఫన్లు తెరుచుకున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తున్నది. దీంతో సరళాసాగర్ నిండుకుండగా మారడంతో మంగళవారం మూడు ఉడ్ సైఫన్లు, ఒక ప్రైమరీ సైఫన్ తెరుచుకున్నట్టు ప్రాజెక్ట్ ఏఈ రనీల్రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం ప్రాజక్ట్లోని లక్ష్మీబరాజ్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది. గోదావరి, ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తుడటంతో బరాజ్కు వరద పోటెత్తుతున్నది. మంగళవారం 7,02,410 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. అంతే మొత్తంలో బరాజ్లోని గేట్లన్నీ (85) ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 39,680 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టు 4 వరదగేట్ల ద్వారా 16,566 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.313 టీఎంసీలకు ప్రస్తుతం 78.022 టీఎంసీలున్నాయి.