మాదాపూర్ (హైదరాబాద్ ) : తెలంగాణ సిద్ధాంత కర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ (JayaShanker) తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అని ఎమ్మెల్యే విప్ అరెకపూడి గాంధీ(Whip Arikepudi Gandhi) అన్నారు. ఆదివారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో పాల్గొని జయ శంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య జయశంకర్సార్ దృఢ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎన్నటికి మరిచిపోదని చెప్పారు. ఆయన జీవితాంతం తెలంగాణ కొరకు పరితపించిన మహానుబావుడని అన్నారు. ఆయన మార్గదర్శకత్వంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నడుస్తున్నారని, తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతున్నారని కొనియాడారు. నాలుగు కోట్ల ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంత కర్త అని కొనియాడారు.
జయశంకర్ సార్ విగ్రహవిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్, హఫీజ్పేట్ డివిజన్ కార్పొరేటర్ వి. పూజిత గౌడ్, చందానగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, విశ్వకర్మ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అడ్లూరు రవీంద్ర చారి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కమిటీ సభ్యులు శ్రీధర్ చారి, మల్లేష్ చారి, కృష్ణ చారి, డివిజన్ నాయకులు రాజేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.