ముషీరాబాద్ : డ్రైనేజీ పైపులైన్పై చేపట్టిన ఓ ఇంటి నిర్మాణం కారణంగా నలభై ఏండ్లుగా తలెత్తుతున్న మురుగు, వరద నీటి ఇక్కట్లకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఒక ఇంటి నిర్మాణం కారణంగా వీధి వీధంతా పడుతున్న అవస్తలకు జీహెచ్ఎంసీ సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు పుల్స్టాఫ్ పెట్టారు. డ్రైనేజీ పైపులైన్పై అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని తొలగించి మురుగు, వరద నీటి సమస్యకు పరిష్కారం చూపాలంటూ నలభై ఏండ్లగా ఆ వీధి వాసులు చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలిచింది. జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు శుక్రవారం అక్రమ నిర్మాణాన్ని తొలగించి మురుగు నీటి పైపులైన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారు. అడిక్మెట్ డివిజన్ రాంనగర్ చౌరస్తా సమీపంలోని మణెమ్మ గల్లీలో కొన్ని సంవత్సరాల క్రితం డ్రైనేజీ పైపులైన్పై ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. అంతేకాదు అక్కడే గేదెల పెంపకం చేపట్టడంతో వాటి వ్యర్థాలు పైపులైన్లోకి వెళ్తుండటం, మాటిమాటికి మురుగు నీటి లీకేజీ సమస్య తలెత్తడం పరిపాటిగా మారింది. జలమండలి అధికారులు మురుగు నీటి లీకేజీ సమస్య తలెత్తినప్పుడల్లా పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడింది. పైపులైన్పై ఇంటి నిర్మాణం అడ్డుగా ఉండటంతో వర్షం కురిసిన ప్రతిసారి వరద నీటి సమస్య తలెత్తుతుంది. మురుగు నీటి సమస్య పరిష్కారం కోసం గతంలో పైపులైన్ నిర్మాణం మొదలు పెట్టిన అధికారులు అడ్డుగా ఇంటి నిర్మాణం ఉండటంతో చేసేది ఏమిలేక చేతులెత్తేశారు.
ఇదే విషయమై స్థానికులు దాదాపు 4 దశాబ్దాలుగా తమ వీధి మురుగు నీటి సమస్యను పరిష్కరించాలంటూ అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఎట్టకేలకు స్పందించిన టౌన్ప్లానింగ్ అధికారులు శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ పైపులైన్పై ఉన్న అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. సర్కిల్-15 టౌన్ప్లానింగ్ ఏసీపీ పావనీ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ఆక్రమణలను తొలగించారు.
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు…
దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న తమ వీధి మురుగు నీటి సమస్యకు టౌన్ప్లానింగ్ అధికారులు పరిష్కారం చూపడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పని చేసిన పలువురు టౌన్ప్లానింగ్ ఏసీపీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ప్రస్తుత ఏసీపీ పావని ప్రత్యేక దృష్టిసారించి అక్రమణలను తొలగించారని మణెమ్మ గల్లీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణలు ఉపెక్షించం…
ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. మణెమ్మ గల్లీలో డ్రైనేజీ పైపులైన్పై ఇళ్లు నిర్మించడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను స్థానికులు తమ దృష్టికి తీసుకురావడంతో వాస్తవాలు పరిశీలించి ఆక్రమణలను తొలగింపు చర్యలు చేపట్టాం. -పావని, ఏసీపీ సర్కిల్-15 టౌన్ప్లానింగ్
పోలీసుల అదుపులో కార్పొరేటర్ తనయుడు
డ్రైనేజీ పైపులైన్పై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా అధికారులతో వాగ్వివాదానికి దిగిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడిక్మెట్ బీజేపీ కార్పొరేటర్ సునీతాగౌడ్ తనయుడు తరుణ్గౌడ్తోపాటు మరికొంతమంది కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ టౌన్ప్లానింగ్ అధికారులతో గొడవకు దిగగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.