బంజారాహిల్స్ : కరోనా మహమ్మారితో ప్రజలంతా తీవ్ర భయాందోళనలతో ఇంటికే పరిమితమైన గడ్డుకాలంలో ఆశావర్కర్లు అందించిన సేవలు వెలకట్టలేనివని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేపట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో గురువారం బంజారాహిల్స్,షౌకత్నగర్ పీహెచ్సీల పరిధిలో పనిచేస్తున్న ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ ఆశావర్కర్లు ఎంతో సాహసాన్ని ప్రదర్శిస్తూ వైద్యసేవల్లో పాల్గొన్నారని, కరోనా పరీక్షలు, వాక్సిన్ల పంపిణీ, ఇంటింటికీ వెళ్లి జ్వరసర్వే తదితర కార్యక్రమాల్లో ఆశావర్కర్లు అద్బుతంగా పనిచేశారని ప్రశంసించారు.
ఆశావర్కర్లు గర్భిణీల సర్వే, జ్వర సర్వే, వాక్సినేషన్ కార్యక్రమాలలో రిజిస్టర్లలో వివరాలు నమోదు చేసేందుకు ఇబ్బందులు పడుతుంటారని, వారి ఇబ్బందులను దూరం చేసేందుకు స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. వైద్యశాఖలో పనిచేస్తున్న ఆశావర్కర్లు చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్రావు గుర్తించి జీతాలను పెంచారని, స్మార్ట్ ఫోన్లతో వారి పనిఒత్తిడి కొంతతగ్గే అవకాశం ఉందన్నారు.
ప్రజలకు సంబంధించిన పూర్తి ఆరోగ్యసమాచారాన్ని స్మార్ట్ ఫోన్ల ద్వారా నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డీఎమ్హెచ్వో డా. వెంకటి, ఎస్పీహెచ్వో డా.అనురాధ, స్థానిక కార్పొరేటర్ కవితారెడ్డి, వైద్యాధికారి డా.సీమా రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.