Hyderabad Metro | సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మెట్రో రెండోదశ పనులు క్షేత్ర స్థాయిలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండో దశకు సంబంధించిన 7 ప్రధాన కారిడార్లలో ట్రాఫిక్ సర్వేతో పాటు నిర్మాణానికి సంబంధించిన అంశాలపై మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండో దశకు సంబంధించిన డీపీఆర్ను 3 నెలల్లో సిద్ధం చేయాలని సూచించడంతో అదే పనిలో మెట్రో యంత్రాంగం నిమగ్నమైంది. అయితే రెండోదశలో ప్రతిపాదించిన కారిడార్లన్నీ ఇప్పటికే నిర్మించిన మొదటి దశ మెట్రోతో అనుసంధానం చేస్తూ ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకు అనుగుణంగానే మొత్తం 7 కారిడార్లలో 70 కి.మీల దూరంతో రెండోదశ నిర్మాణం కోసం డీపీఆర్ను సిద్ధం చేసే పనిలో మెట్రో అధికారులు ఉన్నారు. అయితే ఇక్కడే మెట్రో అధికారులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. మొదటి దశ మెట్రో పూర్తిగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించగా, రెండో దశను ఏ విధానంలో నిర్మించాలన్న దానిపై స్పష్టత లేదు. కేవలం డీపీఆర్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మెట్రో సంస్థకు బాధ్యతలు అప్పగించినా, అసలు కథంతా రెండు దశలను కలిపి నిర్మించడం, ఆ తర్వాత వాటి నిర్వహణ మీదే సంక్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి. అసలే రద్దీగా ఉండే రోడ్లపై మెట్రో ప్రాజెక్టు నిర్మాణమే ఒక విధమైన సవాలు అయితే, అంతకు ముందు దాని డిజైన్ రూపకల్పన మరింత సంక్లిష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న మెట్రో మొదటి దశలో 5 చోట్ల లింకులు కలుపుతూ.. 7 మార్గాలను 70 కి.మీ మేర నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడే అసలు సవాలు ఎదురవుతున్నది. మొదటి దశను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రోతో కలిసి పనిచేసేలా నిర్మాణం చేపట్టాలా? లేక అక్కడి నుంచి వేర్వేరుగా కారిడార్లను నిర్మించాలా? అన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రధానంగా మొదటి దశను పీపీపీ విధానంలో నిర్మించిన ఎల్ అండ్ టీ దాని నిర్వహణను సుమారు 30 ఏండ్ల పాటు నిర్వహిస్తుండగా, కొత్తగా నిర్మించే మార్గాలను దానికి అప్పగించడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా మెట్రో వయాడక్ట్ నిర్మాణాన్ని కలిపి నిర్మించాలా? లేక అక్కడికి సమీపం నుంచి నిర్మించాలా? అన్నది ఒకటైతే, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత మెట్రో రైళ్లను నిర్వహించే బాధ్యతలు ఎలా చేపట్టాలి? అందుకు ఎల్ అండ్ టీ వాడిన సిగ్నలింగ్ టెక్నాలజీని వినియోగించాలా? లేదా అంతకన్నా మెరుగైన టెక్నాలజీని వాడాలా అన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా పలు అంశాలను మెట్రో అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా కారిడార్-1(మియాపూర్-ఎల్బీనగర్) మార్గంలో ఒకవైపు ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు (8 కి.మీ), మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరు వరకు (14 కి.మీ) ప్రతిపాదించిన రూట్లను నిర్వహించాలంటే మొదటి దశ కీలకంగా ఉంటుంది.
మొదటి దశకు సంబంధం లేకుండా మెట్రో కారిడార్లను నిర్మించాలంటే మెట్రో డిపోలను ఎక్కువ చోట్ల నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో భూములు అవసరం, నిర్మాణం కోసం అధికంగా వ్యయమవుతుంది. దీనికి బదులుగా కారిడార్-1కు ఇరువైపులా కొత్తగా ఒకవైపు 8, మరో వైపు 14 కి.మీ అనుసంధానం చేస్తే ఎల్ అండ్ టీ మెట్రోనే దాని నిర్వహణకు అంగీకరిస్తే కొత్తగా మెట్రో డిపోలను నిర్మించాల్సిన అవసరం ఉండదు.
ఇక మొదటి దశ మెట్రో కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో ఒకవైపు రాయదుర్గం నుంచి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ వరకు 8 కి.మీ, మరోవైపు నాగోల్ నుంచి ఎల్బీనగర్, అక్కడి కారిడార్-1కు అనుసంధానం చేయాలా? వద్దా? అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని డీపీఆర్ను రూపొందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ప్రతిపాదించిన మెట్రో మార్గాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలి. ప్రారంభ మెట్రో స్టేషన్ ఎలా ఉండాలి? అన్న విషయాలను కీలకంగా పరిశీలించాల్సి ఉన్నదని ఓ మెట్రో అధికారి తెలిపారు. అంతిమంగా ప్రయాణికులకు నాన్ సాప్ట్ (ఒక చివర నుంచి మరో చివరకు) ప్రయాణం చేయాలంటే లింకుల్లేని కారిడార్లను అందుబాటులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక భారం తగ్గాలన్నా, భవిష్యత్తులో నిర్వహణ, మరమ్మతుల ఖర్చులు తక్కువగా ఉండాలన్నా మొదటి దశ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రోతో కలిసి ప్రాజెక్టులను నిర్వహించేందుకు వీలుగా డిజైన్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు.
కారిడార్ 2: ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు (5.5 కిలోమీటర్లు)
కారిడార్ 2: ఫలక్ నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు (1.5 కిలోమీటర్లు).
కారిడార్ 4: నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్దేవ్పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు (మొత్తం 29 కిలోమీటర్లు).
కారిడార్ 4: మైలార్దేవ్పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు (4 కిలోమీటర్లు).
కారిడార్ 5: రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) వరకు (8 కిలోమీటర్లు).
కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరు వరకు (14 కి.మీ).
కారిడార్ 7: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు (8 కిలోమీటర్లు).