సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): నగరంలోని నివాస కాలనీల సంక్షేమ సంఘాలపై గతంలో హైకోర్టు విధించిన నిబంధనలను పునరుద్ధరించారు. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ప్రకటనను విడుదలజేశారు. కాలనీ సంక్షేమ సంఘాలు ఇక నుంచి తమ కార్యకలాపాలను మునుపటిలా నిర్వహించుకోవచ్చని, ముఖ్యంగా బ్యాంకు అకౌంట్లలో లావాదేవీలు చేసుకోవచ్చని తెలిపారు. 2019లో కాలనీ సంక్షేమ సంఘాల కార్యకలాపాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడంతో అప్పటి నుంచి ఆయా సంఘాలు తమ నివేదికలను, అకౌంట్లను నిర్వహించలేకపోయాయి. తాజాగా.. దీనిని పునరుద్ధరించడంతో నగరంలోని కాలనీ సంక్షేమ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
హౌసింగ్ సొసైటీలు, అపార్టుమెంట్ కాంప్లెక్సులు, గేటెడ్ కమ్యూనిటీలలో నివసించే వ్యక్తులు తమ జీవన స్థితిగతులను మెరుగుపర్చుకోవడానికి ఈ సంఘాలు పనిచేస్తాయి. నిర్వహణ, భద్రత, సామాజిక కార్యకలాపాలు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తాయి. ఇందుకోసం రకరకాల నివేదికలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు అకౌంట్లను తెరిచి లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఇలా తమ అవసరాల కోసం ఉన్న కాలనీ సంక్షేమ సంఘాలపై విధించిన నిబంధనలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో.. ప్రభుత్వ సానుకూలంగా స్పందించి కాలనీ సంక్షేమ సంఘాలపై ఉన్న నిబంధనలను సడలిస్తూ, ఇంతకు ముందు మాదిరిగానే తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని సూచించింది.