సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): కంపెనీల్లో బోర్డు పాత్ర పాలించడమే తప్ప ఆదేశాలివ్వడం కాదని, కంపెనీ పాలనా వ్యవహారాల్లో మహిళలు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.రామకృష్ణన్ అన్నారు. గురువారం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో టీ హబ్లో ఫ్యామిలీ బోర్డులలో మహిళల పాత్రపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వి.రామకృష్ణన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ… కుటుంబం నిర్వహించే వ్యాపారాల్లో మహిళలు సైతం కీలక స్థానంలో ఉండి కంపెనీలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం కొంత మేరకే ఉన్నా..
మరింతగా పెరగాల్సిన అవసరం ఉన్నదన్నారు. ముఖ్యంగా ఒక కంపెనీ నిర్వహణలో జవాబుదారీతనం, చిత్తశుద్ధి, సమర్థత చాలా ముఖ్యమైన అంశాలని పేర్కొన్నారు. కుటుంబ పరిధిలో ఉండే కంపెనీలు చాలా ఉన్నాయని, వ్యాపారాల నిర్వహణలో నిర్ణయం తీసుకోవడంలో కుటుంబ సభ్యులు మూల స్తంభాలుగా ఉన్నారని, ఇందులో మహిళలు సైతం ఉన్నారని, దీని వల్ల పురోగతి, సమానత్వం, మెరుగైన పాలన దిశగా ఒక అడుగు ముందుకు పడుతుందన్నారు. ఈ సమావేశంలో పాల్కివాలా ఫౌండేషన్ ట్రస్టీ కస్తూరి బాలాజీ, ఎఫ్ఎల్ఓ నేషనల్ ప్రెసిడెంట్ సుధా శివకుమార్, చైర్ పర్సన్ రితూ షాలతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.