మాదాపూర్, ఫిబ్రవరి 10 : పర్యావరణ పరిరక్షణలో ఎలక్ట్రిక్ వాహనాల పాత్ర అత్యంత కీలకమైంది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల పాటు మాదాపూర్లోని హైటెక్స్ వేదికగా కొనసాగిన మొబిలిటీ నెక్ట్స్ 2023 హైదరాబాద్ సదస్సులో అనేక ఈవీ వాహనాలకు చెందిన కంపెనీలు వారి ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ స్కూటీలు, కార్లు, ఈవీ వాహనాలకు ఉపయోగించే ఉత్పత్తులు, బ్యాటరీలను ప్రదర్శించారు. నగర నలు మూలల నుంచి విచ్చేసిన సందర్శకులు పెద్ద సంఖ్యలో హాజరై ఈవీ వాహనాలపై ఉన్న సందేహాలను స్టాల్స్ నిర్వాహకులను అడిగి నివృత్తి చేసుకున్నారు.
ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు మార్కెట్లో తమ సత్తాను చాటుతూ గట్టి పోటీని ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఈవీ వాహనాలు వినియోగదారులను ఆకర్శించే రీతిలో సరికొత్త డిజైన్లతో పాటు హై రేంజ్ను అందించగల సామర్థ్యంతో వాహనాలను తీసుకువస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా బ్రిస్క్ ఈవీ ఎనర్జీ పేరుతో హైరేంజ్ కోరుకునే వినియోదారులకు సరికొత్త డిజైన్తో కూడిన ఈవీ స్కూటీలను ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకురానున్నట్లు బిస్క్ ఈవీ వ్యవస్థాపకుడు వివేక్ వర్ధన్ తెలిపారు. వీటి ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా సబ్సిడీతో కలిపి రూ. 1.20 లక్షలుగా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.