హుస్సేన్సాగర్ తీరాన ప్రతిష్టాత్మకంగా జరుగనున్న ఫార్ములా – ఈ రేస్ కోసం కౌంట్డౌన్ మొదలైంది. 2.8 కి.మీటర్ల ట్రాక్పై సుమారు 322 కి.మీటర్ల వేగంతో ఈ- కార్లు దూసుకెళ్లనున్నాయి. 11న జరిగే పోటీలకు రెండ్రోజుల ముందు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మరోవైపు మెగా ఈవెంట్ కోసం భారీగా చేపట్టిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సాగర తీరంలో ఈ నెల 11న నిర్వహించనున్న ఫార్ములా -ఈ రేసింగ్కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి పోటీలు కావడంతో తెలంగాణ ప్రభుత్వంతో పాటు రేసింగ్ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నగరాన్ని కార్బన్ రహిత నగరంగా మార్చాలనే తెలంగాణ ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సంగీత ప్రదర్శనలు, వినోద కార్యకలాపాలు ఇక్కడి వచ్చిన వారిని ఆకట్టుకోనున్నాయి.
ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫార్ములా – ఈ రేసింగ్ హైదరాబాద్ వేదికగా ఎంపిక కావడంతో గతేడాది జూలై నుంచే ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 11న నిర్వహించే రేసింగ్ ఈవెంట్ నిర్వహణ కోసం ప్రభుత్వం రెండు కీలకమైన కార్యనిర్వాహక కమిటీ, మేనేజింగ్ కమిటీలను నియమిస్తూ జీవో ఆర్టీ నం.465ను జారీ చేసింది. వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఫార్ములా ఈ -రేసింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు రెండు కమిటీలు సమన్వయంతో పనిచేసేలా చూశారు. ముఖ్యంగా ఎఫ్ఐఏ నిబంధనలకు అనుగుణంగా సర్యూట్ ట్రాక్స్, వీక్షకుల కోసం గ్యాలరీలు, ఎమోషన్ క్లబ్స్, ఈ-విల్లేజ్, పిట్స్టాప్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎలక్ట్రికల్ పనులు, విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇదే ట్రాక్పైనా ఇండియన్ రేసింగ్ లీగ్ను రెండు దఫాలుగా నిర్వహించారు. ట్రాక్ అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని రుజువు కావడంతో అంతర్జాతీయ ఫార్ములా -ఈ కార్ల పోటీలు ఇక్కడ ఫిబ్రవరి 11న జరుగనున్నాయి.
మెక్ లారెన్, మసెరటి, పోర్షే, జాగ్వార్, నిస్సాన్ మరియు మహీంద్రా రేసింగ్ వంటి ప్రముఖ కంపెనీకు చెందిన మొత్తం 22 కార్లతో 11 జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి.
అంతర్జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్న ఫార్ములా-ఈ కార్ రేసింగ్ ట్రాక్ చుట్టూ మూడు ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. ఈనెల 17న ప్రారంభించనున్న తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం భవనం ఒకవైపు, దాని ఎదురుగా అత్యంత ఎత్తయిన తెలంగాణ అమరవీరుల స్తూపం, అదేవిధంగా ఫార్ములా-ఈ ట్రాక్ మధ్యలో ఎన్టీఆర్ గార్డెన్ను అనుకొని నిర్మాణంలో ఉన్న 125 అడుగుల ఎత్తయిన డాక్టర్ బీఆర్.ఆంబేద్కర్ విగ్రహం ఉన్నాయి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. వీటికి తోడు నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్, ట్యాంక్బండ్, బుద్ద విగ్రహం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.