బడంగ్పేట,డిసెంబర్8: మంత్రాల చెరువుకు మహర్దశ పట్టనున్నది. చెరువులోకి మురుగు నీరు రాకుండా గతంలో ప్రభుత్వం రూ.23కోట్లతో ప్రత్యేక ట్రంక్ లైన్ను ఏర్పాటు చేసింది. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలో నుంచి వచ్చే డ్రైనేజీ నీరు చెరువులోకి రాకుండా నేరుగా మూసీలోకి వెళ్లేలా ట్రంక్ లైన్ కలుపడంతో ఇక నుంచి చెరువులోకి మురుగు నీరు వెళ్లే అవకాశం లేదు. ఇటీవల చెరువను సందర్శించిన విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెరువులో ఉన్న గుర్రపు డెక్కను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
మంత్రి ఆదేశాల మేరకు అధికారులు 70శాతం మేర గుర్రపు డెక్కను తొలగించారు. దీంతో చెరువు పరిసర ప్రజలకు ఇక నుంచి మురుగు వాసనకు స్వస్తి చెప్పిన్నట్లు అవుతుంది.అంతేకాకుండా చెరువు చుట్టూ వాక్కింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సూచించడంతో అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. చెరువు సుందరీకరణకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
బాలాపూర్ మండలంలో ఉన్న చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించింది. ఇప్పటికే జిల్లెలగూడలో ఉన్న చందన చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చాం. మంత్రాల చెరువు, పెద్ద చెరువు, కోమటి కుంట, పోచ్చమ కుంట, ఎర్ర కుంటలను సుందరీకరణ చేయిస్తున్నాం. చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. చెరువులను అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు అందిస్తాం. చెరువులు అన్యాక్రాంతం కాకుండా చూస్తాం. – మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి