బంజారాహిల్స్,సెప్టెంబర్ 2: రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను అటకాయించి గొడవకు దిగడంతో పాటు సినీ ఫక్కీలో వారి దృష్టి మరల్చి డబ్బులు తస్కరిస్తున్న ముఠా సభ్యులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఫిలింనగర్ డీఐ రమేశ్ గౌడ్ వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్కు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి గౌతమ్ యాదవ్(32) అనే వ్యక్తితో పాటు పనిచేస్తున్న యువతి సబ్జా కాలనీలో నివాసం ఉంటుంది. గత నెల 31న రాత్రి 9.30 ప్రాంతంలో ఆమెతో పాటు కారులో తోడుగా వెళ్లిన గౌతమ్ ఆమె ఇంటివద్ద కారు దిగి తన స్నేహితుడి బైక్పై ఇంటికి బయలుదేరాడు. కొంతదూరం రాగానే రోడ్డుపై కాపుకాసిన హకీంషా దర్గా సమీపంలో నివాసం ఉండే అఫ్రోజ్ఖాన్(24) అనే ఆటో డ్రైవర్, మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇబ్రహీం ఖలీలుల్లా(20), పారామౌంట్ కాలనీలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అహ్మద్ఖాన్(21)లు అడ్డుకున్నారు.
ఈ సమయంలో ఎందుకు యువతితో కలిసి వచ్చావంటూ ప్రశ్నించాడు. ఒంటరిగా వస్తున్న స్నేహితురాలిని ఇంటివద్దకు దింపేందుకు వచ్చానని చెప్పినా వినిపించుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది. దాంతో అక్కడినుంచి స్నేహితుడితో పాటు వెళ్లిపోయాడు. అతడి చేతిలో ఓ బ్యాగ్ ఉండటంతో దాన్ని కాజేయాలని నిర్ణయించుకున్న ముగ్గురు నిందితులు బైక్పై అతడిని వెంబడించారు. సుమారు కిలోమీటర్ తర్వాత అంబేద్కర్నగర్ ప్రాంతానికి రాగానే బైకులతో గౌతమ్ యాదవ్ను అడ్డగించారు. గట్టిగా కేకలు వేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేసిన అఫ్రోజ్, ఇబ్రహీం, అహ్మద్ ఖాన్లు అక్కడున్న జనాన్ని పోగు చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. దీంతో తన చేతిలో రూ.4లక్షల నగదుతో ఉన్న బ్యాగును యాక్టివా బైక్కు చెందిన డిక్కీలో పెట్టి తాళం వేశాడు. సుమారు 20 నిమిషాల పాటు స్థానికులకు నచ్చజెప్పడంతో జనం మొత్తం అక్కడినుంచి వెళ్లిపోయారు. రోడ్డుపక్కన తన యాక్టివా బైక్ కోసం చూడగా అది కనిపించలేదు.
దీంతో అక్కడే ఉన్న అహ్మద్ ఖాన్ను ప్రశ్నించగా యాక్టివా బైక్ను ఎవరో తోసుకుంటూ వెళ్లారని అతడి దృష్టి మరల్చి అక్కడినుంచి జారుకున్నాడు. కొంతదూరం వెళ్లి చూడగా యాక్టివా కనిపించింది. అయితే డిక్కీలో పెట్టిన బ్యాగులోని రూ.4లక్షల నగదు పోయినట్లు గుర్తించిన బాధితుడు గౌతమ్ జరిగిన మోసాన్ని గుర్తించకుండా భయంతో అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దృష్టి మరల్చి డబ్బులు తస్కరించినట్లు అంగీకరించారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్పై గతంలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం, చైన్స్నాచింగ్స్, మొబైల్ స్నాచింగ్స్ తదితర 10 కేసులు ఉన్నాయి. అహ్మద్ ఖాన్పై హత్యకేసు ఉన్నట్లు తేలింది. నిందితులను అరెస్ట్ చేసిన ఫిలింనగర్ పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. వారి నుంచి రూ. 2.40లక్షల నగదుతో పాటు 3 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా చోరీ చేసిన డబ్బుల్లో కొంత ఖర్చు చేశారు. ఫిర్యాదు అందిన మూడు గంటల్లోనే కేసును చేధించిన ఫిలింనగర్ డీఐ రమేశ్ గౌడ్, ఎస్ఐ శ్రీకాంత్తో పాటు ఇతర సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.