గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న పనులు జాప్యం చేయకుండా శరవేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. సోమవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలోని అంబర్పేట, గోల్నాక, బాగ్అంబర్పేట, నల్లకుంట, కాచిగూడ తదితర ఐదు డివిజన్లలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన సూచించారు.
డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ల ఏర్పాటు, ప్రధాన, అంతర్గత రహదారుల అభివృద్ధి, డివైడర్ల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి తదితర పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. దీంతో పాటు కొత్తగా పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈలు సుధాకర్, సువర్ణ, ఏఈ ఫరీద్, వర్క్ ఇన్స్పెక్టర్స్ రవి, నరేందర్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.