బండ్లగూడ,డిసెంబర్ 30: యజమానిని కిడ్నాప్ చేసి, డబ్బులు వసూలు చేసేందుకు యత్నించిన కారు డ్రైవర్ కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. గచ్చిబౌలికి చెందిన సాయికిరణ్రెడ్డి బహదూర్పురలో హీరో మోటర్ కార్ప్ డీలర్ షిప్ను నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు గచ్చిబౌలి నుంచి రాజేంద్రనగర్ ఔటర్ రింగ్రోడ్డు మీదుగా బహదూర్పురకు వస్తాడు. అతడి వద్ద మహబూబ్నగర్కు చెందిన సుదర్శన్ కొంతకాలంగా కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు.
సాయికుమార్ గురించి పూర్తిగా తెలుసుకున్న కారు డ్రైవర్ సుదర్శన్.. యజమానిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని స్కెచ్ వేశాడు. ఇందుకు అతడి స్నేహితులతో కలిసి పథకం రచించాడు. ఈ నెల 27న మధ్యాహ్నం బహదూర్పుర నుంచి గచ్చిబౌలికి ఫార్చునర్ కారులో యజమానితో కలిసి సుదర్శన్ బయలుదేరాడు. రాజేంద్రనగర్ సమీపంలోని పత్తికుంట వద్దకు రాగానే డ్రైవర్ కారు ఆపాడు. మూత్ర విసర్జనకు వెళ్తున్నట్లు చెప్పి.. కారులోంచి దిగాడు. పథకం ప్రకారం అక్కడున్న సుదర్శన్ స్నేహితులు అర్జున్, అనిల్, విజయ్ కారులోకి ఎక్కి.. సాయి కిరణ్ను గట్టిగా పట్టుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సాయికిరణ్ మరో డోర్ నుంచి బయటకు వచ్చి.. బిగ్గరగా అరిచాడు.
సమీపంలో ఉన్న డీసీఎం డ్రైవర్తో పాటు పలువురు వాహనదారులు గమనించడంతో సాయికిరణ్ను అక్కడే విడిచిపెట్టి.. నిందితులు అక్కడి నుంచి కారులో ఉడాయించారు. జరిగిన ఉదంతంపై సాయికిరణ్ తన తండ్రి దినేశ్ కుమార్రెడ్డికి ఫోన్ ద్వారా వివరించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న దినేశ్రెడ్డి కుమారుడిని తీసుకొని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా అర్జున్, సుదర్శన్ను చౌటుప్పల్లో అదుపులోకి తీసుకున్నారు. సుదర్శన్పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న అనిల్, అజయ్ కోసం గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. సుదర్శన్పై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏసీపీ గంగాధర్, ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు, డీఐ పవన్ కుమార్ను ఈ సందర్భంగా డీసీపీ జగదీశ్వర్రెడ్డి అభినందించి నగదు రివార్డులను అందజేశారు.