సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ ): గ్రేటర్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. కాలనీలు, అసోసియేషన్లు, బస్తీ కమిటీలు, వ్యాపార రంగాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. మా సీఎం కేసీఆరే., మా ఓటు బీఆర్ఎస్కే.. అంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల పార్టీ కార్యాయాలు గులాబీమయంగా మారుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేశారు.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రచారంలో ఇతర రాజకీయ పక్షాల కన్నా ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలతో పాటు విపక్ష పార్టీల నేతలు గులాబీ కండువా కప్పుకునేందుకు పోటీ పడుతున్నారు. గ్రేటర్లో అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసి ‘తీన్మార్’ మోగించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. విపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ బీఆర్ఎస్ ప్రచార పర్వానికి తెర తీసింది. అందరూ ఒక్క తాటిపైకి వచ్చి భారీ మెజార్టీ లక్ష్యంగా కార్యాచరణతో ముందుకెళ్తున్నారు.
ఎటు చూసినా గులాబీ శ్రేణుల ప్రచారం కనిపించడంతో.. విపక్ష పార్టీల కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలో అభ్యర్థుల కరువు కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి రోజులు గడుస్తున్నా.. ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికీ ప్రకటించలేదు. ఇప్పట్లో అభ్యర్థులేవరో తేలేలా లేదని ఆ పార్టీల నేతలు మండిపడుతున్నారు. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నా.. టికెట్ ఎంపికలో మాత్రం వలస నేతలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందులో బీసీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కోపంతో ఉన్నారు. ఇప్పట్లో అభ్యర్థుల లెక్క తేల్చరంటూ.. ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్తోనే భవిష్యత్తుగా భావిస్తూ స్వచ్ఛందంగా వచ్చి కారెక్కుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో అభివృద్ధి సాధ్యం కాదని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని చెబుతున్నారు. ఈ అభివృద్ధిలో మేము సైతం.. అంటూ గులాబీ కండువా కప్పుకుంటున్నారు.
శామీర్పేట, అక్టోబర్ ౧౩ : తెలంగాణలోనే కాదు దేశంలో కూడా కాంగ్రెస్, బీజేపీలు దివాలా తీస్తున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉమ్మడి శామీర్పేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్శితులై ప్రతిపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ రెడ్ కార్పెట్ పరుస్తుందన్నారు. పార్టీ కోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ సముచిత న్యాయం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ. జహంగీర్, నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, సర్పంచ్ గుర్క కుమార్ యాదవ్, ఉప సర్పంచ్ ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ సుజాత, వార్డు సభ్యుడు రాజు, గ్రామ అధ్యక్షులు వెంకటేశ్, శ్రీనివాస్గౌడ్, నాయకులు మన్మచారి, సంతోష్రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఇమ్రాన్, రాము, హరిమోహన్రెడ్డి, భిక్షపతి, దత్తుగౌడ్, వెంకటేశ్, హరి, మల్లేశ్, చంద్రశేఖర్, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
మూడుచింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామానికి చెందిన నర్సింహులు, రాజయ్య, శామీర్పేట మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కిట్టురెడ్డి, మల్లారెడ్డి, నరేశ్, శివ, మహేశ్, లోకేశ్, సాయి, ఆదిత్య, సిద్ధు, కిరణ్తో పాటు మరో ౫౦ మంది బీఆర్ఎస్లో చేరగా.. మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.