మేడ్చల్/ కీసర/ ఘట్కేసర్, జనవరి 27 : కంటి వెలుగు 2.0 కార్యక్రమానికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. ఆరవ రోజు శుక్రవారం కంటి సమస్యలు ఉన్న వారు పెద్ద ఎత్తున కంటి వెలుగు శిబిరాలకు తరలివచ్చారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, బోడుప్పల్, జవహర్నగర్, పీర్జాదిగూడ కార్పొరేషన్లతో పాటు ఏడు మున్సిపాలిటీల్లో 20 కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 2,331 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 550 మందికి కంటి అద్దాలు ఇవ్వగా, 528 మందికి కంటి అద్దాలను ఇచ్చేందుకు గుర్తించారు. కాగా 324 మందికి శస్త్ర చికిత్సల కోసం రిఫర్ చేశారు. కీసర మండలం భోగారంలో శుక్రవారం కంటి వెలుగు కేంద్రాన్ని ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ ప్రారంభించారు. మండల వైస్ ఎంపీపీ జె. సత్తిరెడ్డి, కీసర ఎంపీడీవో రమాదేవి, కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సరిత, భోగారం సర్పంచ్ సుంకరి కవితజైహింద్రెడ్డి, ఉప సర్పంచ్ రాంశెట్టి జానకీరాం, ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకట్రెడ్డిల తదితరులు పాల్గొన్నారు.