కుత్బుల్లాపూర్, జూలై 17: ప్రభుత్వ రంగ సంస్థలలో హెచ్ఎంటీ ఎంతో విశిష్టమైనదని, అందులో పని చేసి పదవీ విరమణ పొందిన కార్మికులతో పాటు ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కోరారు. బెంగళూరులోని సంస్థ చైర్మన్ పంకజ్ గుప్తతో పాటు ఇతర అధికారులతో సోమవారం సమావేశమై కార్మికుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. దేశ అభివృద్ధికి తనదైన రంగంలో ఎంతో సేవలు అందించిన హెచ్ఎంటీ సంస్థ ఇప్పుడు దీన స్థితిలో ఉందని, అందులో పని చేసిన కార్మికులకు ఇంకా పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు.
పదవీ విరమణ తర్వాత చాలా మంది ఉద్యోగులు నాలుగేండ్ల తర్వాత కూడా వారికి సరైన టెర్మినల్ ప్రయోజనాలు పొందలేదని, కొన్ని సందర్భాల్లో 2011 నుంచి వర్క్లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లించలేదని, టెర్మినల్ ప్రయోజనాలను పొందకుండానే కొంతమంది రిటైర్డు ఉద్యోగులు చనిపోయారని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న వారికే ప్రయోజనం అందుతుందని, మిగతా కార్మికులకు, ఉద్యోగులకు పీఎఫ్, గ్రాట్విటీ, వడ్డీ ప్రయోజనాలు సత్వరమే అందించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీహెచ్ఓ అధ్యక్షులు చంద్రశేఖర్, బెంగుళూరు అధ్యక్షులు హరీశ్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, సీహెచ్ఓ ప్రసన్న, హైదరాబాద్ కార్యనిర్వాహక అధ్యక్షులు సత్యనారాయణ, శ్రీశైలం, ప్రసాద్ పాల్గొన్నారు.
ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి
ఖైరతాబాద్, జూలై 17: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హెచ్ఎంటీలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఐదేండ్లుగా రిటైర్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని పలువురు విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్ఎంటీ మిషిన్ టూల్స్ లిమిటెడ్ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం చీఫ్ కో ఆర్డినేటర్ బీఎన్ మధు కృష్ణారావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా హెచ్ఎంటీకు సంబంధించి ఆరు యూనిట్లకు చెందిన సుమారు 600 మంది పదవీ విరమణ పొందారన్నారు. వీరు తమ భవిష్యత్ కోసం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యూటీ, లీవ్ ఎన్కాష్మెంట్ తదితర బకాయిలను గత ఐదేండ్ల నుంచి సంస్థ చెల్లించడం లేదన్నారు.
ఒకప్పుడు వేలాది మంది ఉద్యోగులతో కళకళలాడిన హెచ్ఎంటీలో నేడు ఆ పరిస్థితులు లేవని, ప్రస్తుతం, వెల్డింగ్, టర్నింగ్ లాంటి భారీ యంత్రాలను తయారు చేస్తున్నదని, తాజాగా, చంద్రాయాన్ 3కు సంబంధించిన బీఎం 112, 114, 115 లాంటి భారీ యంత్రాలను తయారు చేసి ఇచ్చామని, అయినా, సంస్థ ఉద్యోగులపై యాజమాన్యం శ్రద్ధ చూపడం లేదన్నారు. ఉద్యోగులకు సమయానికి వేతనాలు కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. సుమారు 40 మంది ఉద్యోగులు బకాయిలు పొందకుండానే చనిపోయారని వాపోయారు. వారి కుటుంబాలు దీనావస్థలో ఉన్నాయని, యాజమాన్యానికి పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. గతేడాది రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్కు ఫిర్యాదులు చేశామన్నారు. ఐదేండ్లుగా తమ గోడును పట్టించుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకొని తమ బకాయిలను చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం కోఆర్డినేటర్లు రాములు, మల్యాద్రి, వి.రవీందర్, పోచయ్య, శ్రీనివాస్, ఆనంద్ రావు, వెంకటరత్నం, పాలలోచన రావు తదితరులు పాల్గొన్నారు.