తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 19 : మలేషియాలో తెలుగు భాష, సంస్కృతులను పరిరక్షిస్తూ భావితరాలకు అందించే ప్రయత్నంలో భాగంగా తెలుగు విద్యాబోధనా తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయని సెలంగర్ మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు వి. కృష్ణారావు వెల్లడించారు. సెలంగర్ మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో తెలుగు కుటుంబాల పిల్లలకు కౌలాలంపూర్ నగరంలో ప్రత్యేకంగా 2023 విద్యా సంవత్సరానికి గాను తెలుగు భాషలో విద్యాబోధనా తరగతులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మలేషియాలో సుమారు వెయ్యి మంది పిల్లలకు తెలుగులో బోధనా తరగతులకు గాను పిల్లల తల్లిదండ్రుల నుంచి మంచి మద్దతు లభిస్తుందన్నారు. తెలుగు అసోసియేషన్ సెలంగర్ ఆధ్వర్యంలో విద్యా బోధనతోపాటు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.
ముఖ్యంగా తెలుగు పండుగలను యువకులకు తెలిపేలా ఎక్కువ మందిని ఆకర్షిస్తూ మన సంస్కృతికి పెద్దపీట వేస్తున్నామని ఆయన వివరించారు. మార్చి 22న కౌలాలంపూర్లో శ్రీకృష్ణదేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురుషులు, మహిళలతో ఘనంగా జరుపుకునేలా ఇప్పటినుండే ఏర్పాట్లు చేస్తూ ప్రత్యేకంగా కమిటీలు వేశామన్నారు. తెలుగు సంప్రదాయాలను సురక్షితంగా ఉంచడమే అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.