చర్లపల్లి, ఫిబ్రవరి 27 : తాళం పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కుషాయిగూడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సాయిప్రకాశ్గౌడ్ కథనం ప్రకారం.. కమలానగర్లో నివాసి బీబీ. సుబ్రహ్మణ్యం రిటైర్డ్ ఉద్యోగి. అతడు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 25న ఇంటికి తాళం వేసి కాశీ తీర్థయాత్రలకు వెళ్లాడు. దీంతో ఎదురుగా ఉండే హరినారాయణ మూర్తి రెండు రోజులుగా సుబ్రహ్మణ్యం ఇంటిని గమనిస్తున్నాడు. మంగళవారం ఉదయం చూడగా.. సుబ్రహ్మణ్యం ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. తాళం కూడా పగులగొట్టి ఉండటంతో ఆందోళనకు గురైన హరినారాయణ మూర్తి లోనికి వెళ్లి చూడగా.. ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కుషాయిగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కాశీలో ఉన్న సుబ్రహ్మణ్యంతో మాట్లాడిన పోలీసులు.. భద్రపరిచిన నగలు, నగదు గురించి ఆరా తీశారు. ఇంట్లో 20 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్టు సుబ్రహ్మణ్యం సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భవానీనగర్లోని సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయంలో కూడా దుండగులు చోరీకి యత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కార్యాలయంలో ఎలాంటి నగదు, నగలు చోరీ జరగలేదన్నారు. ఘటనా స్థలాన్ని మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఏసీపీ నరేశ్రెడ్డి, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మహేశ్కుమార్ సందర్శించి, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.