మియాపూర్, జూలై 20 : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో శేరిలింగంపల్లి జోన్లో రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. రెండు రోజుల పాటు భారీ వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. కాగా జోన్ పరిధిలోని చందానగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో జన జీవనం స్తంభించింది. రహదారులపై వాహనాలు బారులు తీరాయి. హైటెక్ సిటీ ప్రాంతం సహా కొండాపూర్, హెచ్సీయూ, హఫీజ్పేట్, మియాపూర్, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, బొల్లారం రోడ్, అయ్యప్ప సొసైటీ రోడ్ సహా పలు ప్రాంతాల్లో వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నది. కాగా లోతట్టు ప్రాంతాలలో జోన్ పరిధిలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్(మెట్) బృందాలు పర్యటించి వరద సహాయక చర్యలను చేపట్టాయి. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
అటుగా వాహనాలు వెళ్లకుండా నియంత్రించారు. శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో వార్డుల వారీగా 8 మెట్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలలో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల లోగా మియాపూర్ డివిజన్ జేపీనగర్లో 7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. బల్దియా మొత్తంలోనే గరిష్ట వర్షపాతంగా నమోదైంది. శేరిలింగంపల్లి డీసీ రజనీకాంత్రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ నగేశ్, సానిటేషన్ ఎస్ఐ జలంధర్రెడ్డి, చందానగర్ ఈఈ శ్రీకాంతిని, వైద్యాధికారి డాక్టర్ కార్తీక్, ఇతర అధికారులు తమ సర్కిళ్లలో పర్యటించి వరద నీటి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం నేపథ్యంలో హైదర్నగర్, చందానగర్ డివిజన్లలోని లోతట్టు ప్రాంతాలలో విప్ గాంధీ పర్యటించారు. మాన్సూన్ బృందాలు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు. కాగా జడ్సీ శ్రీనివాసరెడ్డి పటాన్చెరు సర్కిల్లో పర్యటించి వరద సహాయక చర్యలను పరిశీలించారు.
వరద నీటి ఇబ్బందులు రాకుండా చర్యలు
కొండాపూర్, జూలై 20 : మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు తలెత్తకుండా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాలతో ఇబ్బందులపై జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాఫిక్ పోలీసు అధికారులతో చర్చించి, చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
చందానగరలో పర్యటించిన కార్పొరేటర్ మంజులరెడ్డి..
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తలెత్తిన ఇబ్బందులను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి స్వయంగా పరిశీలించారు. డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్, కేఎస్ఆర్ ఎన్క్లేవ్, వేమన వీకర్ సెక్షన్, ఇంద్రనగర్ కాలనీల్లో పర్యటించారు.