మేడ్చల్, మే10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర శివారుల్లోని మున్సిపాలిటీలను వంద శాతం చెత్త రహితంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధ్యక్షతన వెళ్లిన స్టడీ టూర్ బృందం మంగళవారం ఇండోర్ను సందర్శించింది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శాంసన్తో కలిసి మంత్రి మల్లారెడ్డి మంగళవారం ఇండోర్ మున్సిపల్ కమిషనర్ ప్రతిభ పాల్తో సమావేశమయ్యారు. ఇండోర్ మున్సిపాలిటీల నిర్వహణ పనితీరును పరిశీలించారు. ఇండ్ల నుంచి ఆటోల ద్వారా సేకరించిన వ్యర్థాలను తరలించే చెత్త రవాణా ప్లాంట్, మెటీరియల్ రికవరీ ప్లాంట్ను సందర్శించి పరిశీలించారు. 18 రకాల ఉత్పత్తులను వేరుచేసే విధానం, తదుపరి వాటిని రీ సైక్లింగ్ చేసే పద్ధతులను తెలుసుకున్నారు. ప్రతి రోజు ఆరు వందల టన్నుల కంపోస్ట్ ఉత్పత్తి సామర్థ్యం గల మెకానికల్ కంపోస్టింగ్ ప్లాంట్, తడి చెత్త ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్న (సీఎన్జీ) ప్లాంట్ల వివరాలను తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించే తీరును పరిశీలించారు. చెత్త వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ పద్ధతి, ఇతర అంశాలపై అధ్యయనం చేశారు. పట్టణంలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులతో మాట్లాడి వారి పనితీరును, వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
చెత్త రహిత మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి మల్లారెడ్డి
నగర శివారు మున్సిపాలిటీలను వందశాతం చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని మంత్రి మల్లారెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఇండోర్లోని వివిధ రకాల ప్లాంట్లను పరిశీలించి అవగాహన చేసుకున్నట్లు చెప్పారు. ఇండోర్ మున్సిపల్ కమిషనర్ ప్రతిభ పాల్ మున్సిపల్ నిర్వహణ తీరును వివరించినట్లు మంత్రి తెలిపారు. స్టడీ టూర్ మరో ఐదు రోజుల పాటు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ఈ టూర్లో మేయర్లు జక్క వెంకట్రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, మేకల కావ్య మున్సిపల్ చైర్మన్లు కొండల్రెడ్డి, పావని, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు ఉన్నారు.