Lashkar district , MLA Talasani,Secunderabad,Telangana
హైదరాబాద్ : లష్కర్ జిల్లా సాధన కోసం తాము చేపట్టే పోరాటానికి మద్దతును ఇవ్వాలని లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో నూతనంగా లష్కర్ జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఏర్పాటైన జిల్లా సాధన సభ్యులు గురువారం ఆదర్శ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయనను కలిసి వినతిపత్రాన్ని అందజేసి మద్దతు కోరారు.
ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ జిల్లా పరిధి విస్తరించిన కారణంగా పరిపాలన సౌలభ్యం కోసం లష్కర్ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ పోరాటంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలుపొంది కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులతో పాటు ఈ ఏడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను కూడా కలిసి వినతిపత్రాలను అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి సాధం బాలరాజ్ యాదవ్, ఉపాధ్యక్షులు శైలేందర్, బాబురావు తదితరులు ఉన్నారు.