సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లను మాఫీ చేయడానికి లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింగరావుపై సిటీ పోలీసు కమిషనర్ సజ్జనార్ వేటు వేశారు. ఆయనను వెంటనే బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇన్స్పెక్టర్ నర్సింగరావుతో పాటు ఎస్ఐ అశోక్, హోంగార్డు కేశవులు, కోర్టు కానిస్టేబుల్ సుధాకర్లను కూడా బదిలీ చేస్తూ సీపీ చర్యలు తీసుకున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించిన చలాన్లను క్లియర్ చేయడానికి పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఇప్పటికే ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్స్పెక్టర్లతో పాటు పలువురు పోలీసు సిబ్బందిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్న సీపీ సజ్జనార్.. తాజాగా ఓ కేసులో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై చర్యలు తీసుకున్నారు.