మిథాలీ రాజ్ ఓ ధిక్కారం. పురుష ప్రపంచంలో.. స్త్రీగా తానేమీ తక్కువ కాదు. గట్టిగా మాట్లాడితే.. ఓ అడుగు ఎక్కువేనని చెప్పిన ఆత్మనిబ్బరం. మిమ్మల్ని లేడీ సచిన్ అనవచ్చా? అని అడిగిన ఓ రిపోర్టర్కి.. ‘సచిన్ను మేల్ మిథాలీ రాజ్ అని సంబోధించే సత్తా మీకు ఉందా’? అని ఎదురు ప్రశ్నించిన ధీరత్వం.. మిథాలీ రాజ్ది. ఈ ప్రశ్న ఆ రిపోర్టర్కే కాదు.. మహిళా క్రికెటర్లను చిన్న చూపు చూసే ప్రతి ఒక్కరికీ ఓ చెంపదెబ్బ లాంటి సమాధానం. ఆ మాటకొస్తే .. ఏ రంగంలోనైనా ఓ స్త్రీ సాధించిన
ఘనతను.. మగవారితో పోల్చి చెప్పే విధానాలను పటాపంచలు చేసే స్ట్రెయిట్ డ్రైవ్ అన్నమాట.
అరంగేట్రంలోనే సెంచరీ
1997 ఉమెన్స్ వరల్డ్ కప్ భారత్లో జరిగింది. భారత జట్టు నిరాశపరిచింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఈడెన్ గార్డెన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు .. 45వేల మంది హాజరయ్యారు. అప్పట్లో ఇదో రికార్డ్. మహిళల క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఈ స్థాయిలో జనం హాజరుకావడం అబ్బురపరిచింది. అక్కడ సీన్ కట్ చేస్తే.. ఆ తర్వాత రెండేండ్లు దేశంలో ఉమెన్స్ క్రికెట్కు గ్రహణం పట్టింది. ఓ వైపు సీనియర్ క్రీడాకారిణుల నిష్క్రమణ. మరోవైపు.. భారత జట్టు ఆడిన మ్యాచ్లలో పేలవ ప్రదర్శన. ఈ దశలో.. భారత మహిళా క్రికెట్ జట్టును జనం పట్టించుకోవడం దాదాపు మానేశారు. ఇలాంటి తరుణంలో ఓ మ్యాచ్లో ఓ బ్యాట్స్ ఉమెన్ ఇన్నింగ్స్ .. భారత్తోపాటు ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఒక్కసారిగా అటువైపు చూసేలా చేసింది. అదే 1999లో టాన్టాన్లో జరిగిన ఐర్లాండ్ వర్సెస్ భారత వన్డే మ్యాచ్. ఇదే మ్యాచ్లో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అడుగుపెట్టిన ఓ 16 ఏండ్ల యువ క్రీడాకారిణి చిరస్మరణనీయ ఇన్నింగ్స్ ఆడింది. ఏకంగా డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీ బాదింది. క్రికెట్ రికార్డ్స్తో పాటు భారత్లో మహిళలపై ఉన్న అభిప్రాయాన్ని సమూలంగా మార్చి వేసే అద్భుత శకంపై ..తన సంతకం చేసింది మిథాలీ రాజ్. ది లెజెండరీ లేడీ క్రికెటర్.
రోజూ 6 గంటల కోచింగ్..
ఏదో కూతురు సరదా పడుతున్నదని ఆడిస్తున్న ఆ తండ్రి.. ఇదంతా జరిగే పని కాదులే అనుకున్నాడు. కానీ.. కోచ్ సంపత్ మాటను కాదనలేకపోయాడు. తన పదేళ్ల చిన్నారిని ఆయనకు అప్పగించాడు. అప్పటి నుంచి రోజూ 6 గంటలపాటు కోచింగ్. అప్పుడప్పడూ 8 గంటల పాటు కూడా సాగేది. కోచింగ్ అంటే బ్యాట్తో బంతిని ఆడించడం.. బంతులు క్యాచ్ పట్టడం మాత్రమే కాదు. కోచ్ సంపత్ .. మిథాలీని పూర్తిగా విశ్వసించారు. పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. బంతి ఎలా వచ్చినా.. బ్యాట్కు మిడిల్ చేయాల్సిందే. చిన్న చిన్న గల్లీల్లో బ్యాటింగ్ చేయించేవాడు. బంతిని అటు, ఇటు.. ఎటువైపు గోడకు తాకకుండా నేరుగా స్ట్రెయిట్ డ్రైవ్ కొట్టాలి. లేదా చెప్పిన దిశగా షాట్ ఆడాలి. లేదంటే బెత్తంతో ఓ దెబ్బ కొట్టేవాడు. దీంతో.. ఫూర్తి ఫోకస్తో బ్యాటింగ్ చేయాల్సి వచ్చేది మిథాలీకి. ఇదే ఆమెకు వరమైంది. సంపత్ శిక్షణలో రాటుదేలిన ఆ చిన్నారి 13 ఏండ్లకే ఆంధ్రా జట్టుకు ఎంపికైంది. బక్కపలుచగా ఉన్నా.. గట్టి షాట్స్తో బౌలర్లను హడలెత్తించేది. ఆమె పేరు ఎంతలా మారుమోగిందంటే… 14 ఏండ్లకే ఉమెన్స్ వరల్డ్కప్కు భారత ప్రాబబుల్స్లో తన పేరు చేరిపోయింది. ఇక అంతా మంచే అనుకునే సమయంలో.. అకస్మాత్తుగా కోచ్ సంపత్ కుమార్ చనిపోయారు. అమ్మాయి మరీ చిన్నది.. వరల్డ్కప్లో ఒత్తిడి తట్టుకోలేదు అంటూ .. తుది జట్టులోకి ఎంపిక చేయలేదు.
నిద్రపోయిందంటే.. ఓ పట్టాన లేవదు
నిజానికి మిథాలీ రాజ్ క్రికెట్ బ్యాట్ పట్టడమే ఓ విచిత్ర ఘట్టం. అప్పుడు ఆమె వయస్సు 10 ఏళ్లు. ఇంట్లో గారాల పట్టి. ఏ పని చేయాలన్నా.. తర్వాత చేస్తాలే అని వాయిదాలు వేసే అల్లరి పిల్ల. నిద్రపోయిందంటే ఓ పట్టాన లేవదు. భరత నాట్యం నేర్చుకోవాలన్నది ఆమె కల. తల్లి ప్రోత్సాహంతో శిక్షణ పొందుతోంది. కానీ.. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది. ఈ లేజీ పిల్లను యాక్టివ్గా మార్చాలని తండ్రి దొరై రాజ్ కొడుకుతోపాటు మిథాలీని పొద్దున్నే లేపి .. జింఖానా గ్రౌండ్స్కు తీసుకెళ్లేవాడు. అక్కడ తన అన్న ప్రాక్టీస్ చేస్తుంటే.. బౌండరీ అవుతల చిన్నారి మిథాలీ హోంవర్క్ చేసేది. అంతకు ముందు రాత్రి నుంచి పెండింగ్ పెట్టిన వర్క్స్ .. ఇలా పూర్తయ్యేవన్నమాట. హోంవర్క్ పూర్తయ్యాక ఏంచేయాలో తోచక… అన్నకు సహాయం చేసేందుకు మైదానంలోకి పరుగెత్తేది. బాల్స్ తెచ్చి ఇవ్వడం, బాల్స్ విసరడం చేసేది. అప్పుడప్పుడూ తానూ బ్యాటింగ్ చేస్తాననేది. చెల్లి మీద ప్రేమతో అన్న బ్యాటింగ్ చేయమనే వాడు. అన్న విసిరిన బంతులను మిథాలీ దీటుగా ఎదుర్కొనేది. మంచి గ్రౌండ్ షాట్స్ కూడా కొట్టేది. దీన్ని గమనించిన కోచ్ జ్యోతీ ప్రసాద్ మిథాలీ ఆటలో టెక్నిక్ను గుర్తించేందుకు స్వయంగా పరీక్షించాడు. క్రికెట్ ఆడే సత్తా ఉందని నిర్ధారించుకున్నాక.. ఆమె తండ్రితో మాట్లాడారు. అక్కడి నుంచి ఆ పదేళ్ల పాపను హైదరాబాద్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ సంపత్ కుమార్ దగ్గరికి తీసుకెళితే అతను మిథాలీ ఆటను పరిశీలించారు. ఆమెను షైన్ చేస్తే.. మంచి ఉమెన్ క్రికెటర్ అవుతుందని పాప తండ్రికి చెప్పాడు. మిథాలీని నాకు వదిలేయండి.. ఆమెను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దుతానని చెప్పాడు.
ఎన్నో సవాళ్లు.. మరెన్నో మైలురాళ్లు
మిథాలీ రాజ్ కెరీర్లో ఎన్నో సవాళ్లు.. మరెన్నో మైలు రాళ్లు ఉన్నాయి. అన్నింటినీ అధిగమిస్తూ సాగిన రోలర్ కోస్టర్ రైడ్ .. మిథాలీ రాజ్ 23ఏండ్ల సుధీర్ఘ క్రికెట్ కెరీర్. నిజానికి మిథాలీరాజ్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి ముందు.. ఒకటో అర మహిళా క్రీడాకారుల పేర్లు మాత్రమే దేశవాసులకు గుర్తు. చాలా మందికి మహిళా క్రికెటర్ల పేర్లే తెలియదు. వారి మ్యాచ్లకు లైవ్ ఉండవు. ఉమెన్ క్రికెట్ మ్యాచ్ కోసం స్టేడియాలకు వెళ్లే జనం తక్కువ. కానీ.. మిథాలీ రాజ్ తన ఆటతో క్రికెట్ ప్రపంచాన్నే తన వైపు చూసేలా చేసింది. ఆడపిల్లలపై భారతీయ సమాజంలో కుటుంబ సభ్యులకు ఉండే అభిప్రాయాలన్నింటినీ బద్ధలు కొట్టిన విన్నింగ్ షాట్ మిథాలీ. ఆ మరుసటి సంవత్సరమే సిడ్నీ ఒలింపిక్స్లో కరణం మల్లేశ్వరి రజత పతకం సాధించడం వంటి ఘటనలు ఆడపిల్లలపై కుటుంబసభ్యుల వైఖరి మార్పునకు అంకురం పడింది. ఆడపిల్లలకు చదువు, పెళ్లి, సంసారం, పిల్లలు అనే గిరిని చెరిపేసి వారిని క్రీడా బరిలో నిలిపితే.. కుటుంబానికే కాదు దేశానికే పేరు తెస్తారన్న భావనను బలంగా చాటిన అద్భుత సందర్భం అది. ఆ తర్వాత క్రమంలో ఎందరో క్రీడాకారులు .. పలు రకాల క్రీడల్లో సత్తాచాటి తోటి బాలికలకు, మహిళలకు మార్గదర్శకులుగా మారారు. స్కూల్ బ్యాగ్స్ లేదా పెళ్లి సంబంధాల వేటే పనిగా ఉండే తల్లిదండ్రులు, అన్నాదమ్ములు.. ఇప్పుడు తమ బిడ్డలు అక్కాచెల్లెల్ల కిట్ బ్యాగ్లు మోస్తూ.. వారిని గ్రౌండ్కు తీసుకువెళ్లి ప్రాక్టీస్కు అండగా నిలుస్తున్నారంటే.. అది పీటీ ఉష, మిథాలీ రాజ్.. కరణం మల్లీశ్వరి, సానియా మీర్జా, షట్లర్లు గుత్తా జ్వాల, సైనా నెహ్వాల్, పీవీ సింధూ లాంటి వారి పుణ్యమే.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మశ్రీ అందుకుంటున్న మిథాలీరాజ్ (ఫైల్)
మిథాలీరాజ్ను సన్మానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్)
కలిసొచ్చిన కోల్కతా క్యాంప్..
ఏం చేయాలో దిక్కుతోచని సమయంలో మిథాలీకి తండ్రి దొరై రాజ్ అండగా మారాడు. ఆమెను కోల్కతాలోని నేషనల్ క్యాంప్లో చేర్పించాడు. అక్కడి నుంచి మిథాలీ రాజ్ క్రికెట్ ప్రస్థానం మరో మలుపు తిరిగింది. సహచరులంతా తనకంటే 10 ఏండ్లకు మించి పెద్దవారే కావడంతో.. వారితో పెద్దగా కలిసేది కాదు. దీంతో.. తనకు ఆట తప్ప మరే వ్యాపకం లేకుండాపోయింది. ఇదే ఆమెకు కలిసొచ్చింది. తన బ్యాటింగ్ను అర్థం చేసుకొని.. సమస్యలను గుర్తించి.. సరిదిద్దుకునేది. కోచ్తోపాటు .. కెప్టెన్లు, సీనియర్ క్రీడాకారిణులు కూడా ఆమెకు సహాయం చేసేవారు. దీంతో.. మట్టిలో మాణిక్యంలాంటి మిథాలీ మెరుగుపెట్టిన వజ్రంలా మారింది. అంతర్జాతీయ క్రికెట్లో కొత్త చరిత్రను ముద్రిస్తూ పరుగుల సునామీ సృష్టించింది. ఉమెన్స్ క్రికెట్లో లెజెండ్గా ఎదిగింది. రెండు సార్లు మిథాలీ సారథ్యంలో భారత్ ఫైనల్కు చేరినా ప్రపంచకప్ మాత్రం కలగానే మిగిలిపోయింది..! అది ఆమె సుదీర్ఘ కెరీర్లో ఓ వెలితి..! ఇండియన్ ఉమెన్ క్రికెట్లో ఆమె ఓ విభజన రేఖ..! మిథాలీకి ముందు మిథాలీకి తరువాత అని చెప్పుకోదగ్గ మేటి క్రికెటర్. శిఖర సమాన ఘనతను సాధించిన మిథాలీ రాజ్.. ఈ తరానికే ఓ టార్చ్ బేరర్.
సాహో.. మిథాలీ రాజ్..
ఇప్పటి దాకా భారత దేశా ఉమెన్స్ క్రికెట్ కు తన సర్వం ధారపోసిన మిథాలీ రాజ్.. ఇక చాలని విరామం ప్రకటించింది. రిటైర్మెంట్ తనకు ఎండ్ కార్డ్ కాదు. మరో రూపంలో తాను ఉమెన్స్ క్రికెట్ లో కొనసాగుతూనే ఉంటుంది. కానీ.. అనితర సాధ్యమైన తన జీవన ప్రస్థానం .. మహిళల క్రికట్ లో ఆమె సాధించిన రికార్డులు.. ప్రతీ ఆడపిల్లను, ఆమె కుటుంబ సభ్యులను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఏదో ఒక రంగంలో తన ముద్ర వేయాలనుకునే మహిళలకు .. మిథాలీ ప్రేరణగా మారుతూనే ఉంటుంది. అందుకే యావత్ క్రీడా ప్రపంచంతోపాటు.. ప్రతీ ఆడపిల్ల కుటుంబసభ్యులు అంటున్నారు.. సాహో.. మిథాలీ రాజ్.
– కోడం అజయ్కుమార్