జవహర్నగర్, డిసెంబర్ 8: దమ్మాయిగూడలో దారు ణం చోటుచేసుకుంది. మొబైల్ ఇవ్వలేదని… తోటి స్నేహితుడినే అంతమొందించిన ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం… దమ్మాయిగూడ ప్రాంతంలో ఉత్తర్ప్రదేశ్కు చెందిన జితేందర్ చౌదరి గత కొంత కాలంగా పెయింటింగ్ కాంట్రాక్టర్గా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కూలీ పనుల కోసం ఉత్తర్ప్రదేశ్ చెందిన ఇద్దరు యువకులు రవి జెనార్(15), సచిన్(15) అలియాస్ బాబు చమర్లను తీసుకువచ్చి పనులు చేయించుకుంటున్నాడు. గురువారం పనులకు వెళ్లిన యువకులు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చారు. కల్లు తాగడం అలవాటు ఉన్న యువకులు రాత్రి సమయంలో కల్లుతాగి పడుకున్నారు.
మరుసటి రోజు శుక్రవారం సచిన్ తన మొబైల్ ఫోన్ ఇవ్వమని రవి జెనార్ను అడిగాడు. జితేందర్ చౌదరి పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రస్థాయిలో చోటుచేసుకోగా సహనం కోల్పోయిన సచిన్… రవి జెనార్ని కూరగాయలు కోసే కత్తితో కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై రవి జెనార్ అక్కడిక్కడే మరణించాడు. జితేందర్ చౌదరి(38) ఇంటికి వచ్చి చూడగా రవి జెనార్ అప్పటికే రక్తపుమడుగులో కనిపించాడు. ఏమైందని సచిన్ను అడగ్గా… మొబైల్ ఇవ్వనందున కూరగాయలు కోసే కత్తితో పొడిచానని చెప్పాడు. స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలుపగా.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. నిందితుడు సచిన్ను అదుపులోకి తీసుకున్నారు. జితేందర్ చౌదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.