చార్మినార్, మే 12 : ఓ వర్గానికి చెందిన యువతితో చనువుగా ఉంటున్న ఓ యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హింసించిన ఘటన రెయిన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన కార్తీక్ వంశీ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెయిన్ బజార్ ప్రాంతానికి చెందిన ఓ యువతి(17) చార్మినార్ సమీపంలోని ఓ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నది. ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయమై ఏడాదికాలంగా ప్రేమించుకుంటున్నారు. యువతి గురువారం తెల్లవారు జామున కార్తిక్కు ఫోన్ చేసి యాకుత్పుర సమీపంలోని మార్నింగ్ స్టార్ హోటల్ వద్దకు రావాలని కోరింది. కార్తీక్ ఓలా బైక్లో స్నేహితురాలు సూచించిన ప్రాంతానికి చేరుకున్నాడు. యువతితో కలిసి వెళ్తున్న క్రమంలో మహ్మద్ కమ్రుద్దీన్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి కార్తిక్ను, యువతిని అడ్డుకున్నారు. కమ్రుద్దీన్తో పాటు మరో నలుగురు కార్తిక్ను సమీపంలోనే నిర్మాణ దశలో ఉన్న ఓ భవనంలోకి తీసుకెళ్లారు. గురువారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఓ కుక్కను కార్తిక్ నడుముకు కట్టి దాంతో పలుమార్లు కరిపించే ప్రయత్నం చేశారు. కాళ్లపై ఇటుకలతో దాడి చేసి గాయపర్చారు. రాత్రి 9:30 గంటలైనా కార్తిక్ నుంచి ఎలాంటి సమాచారం లేక పోవడంతో ఆందోళన చెందిన యువతి కార్తిక్ సోదరికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. వెంటనే అప్రమతమైన కార్తిక్ బంధువులు మార్నింగ్ స్టార్ హోటల్ వద్దకు వచ్చి వివరాలు సేకరించే ప్రయత్నంచేశారు.
కమ్రుద్దీన్, అతడి స్నేహితులు రూ.50 వేలు ఇస్తేనే కార్తిక్ను వదిలి పెడుతామని, లేదంటే చంపేస్తామని హెచ్చరించారు. అప్పటికే ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న కార్తిక్ రూ.20 వేలు వెంటనే చెల్లిస్తానని చెప్పడంతో కార్తిక్ను నల్గొండ క్రాస్ రోడ్డు వద్దకు తీసుకెళ్లారు. మరోవైపు యువతి వద్ద నుంచి 15 వేలు డిమాండ్ చేయగా ఐదు వేలు ఇచ్చింది. అప్పటికే ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు మీర్చౌక్ ఏసీపీ దామోదర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కార్తిక్ నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకోగానే నిందితులు కార్తిక్ను అక్కడే వదిలేసి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నామని తెలిపారు.