కొండాపూర్ : భర్త వేధింపులు భరించలేక భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డీ ప్రణయ్ తన భార్య డీ శిరీష (22)తో కలిసి చందానగర్ గౌతమీనగర్లో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
కాగా ఫిబ్రవరి 25 న ప్రణయ్ విధులకు వెళ్ళగా శిరీష ఇంట్లో ఉంది. ప్రణయ్ విధుల నుంచి వచ్చే సరికి ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లోకి వెళ్ళి చూడగా శిరీష బయటకు వెళ్ళిందనుకుని ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది.
ఇంట్లో వెతకగా భర్త వేధింపులు తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్తున్నట్లు నోట్ రాసి పెట్టి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చందానగర్ పోలీసులు తెలిపారు. కాగా శిరీష ఇంట్లో నుంచి పట్టు చీరలతో పాటు 8 తులాల బంగారు నగలను తీసుకువెళ్ళింది. ఈ మేరకు ప్రణయ్ ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల తెలిపారు.