మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 7 : తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులతో దమ్మాయిగూడ మున్సిపాలిటీ అభివృద్ధిలో నంబర్ వన్గా నిలుస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 6వ, 13వ వార్డులలో రూ.2 కోట్ల 11 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు దమ్మాయి చెరువు కట్టపై ఉన్న మైసమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాలు, పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయని, అభివృద్ధికి అనేక నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కోట్ల నిధులు మంజూరు చేశారని, వాటితోనే నేడు సీవరేజీ పైప్లైన్ పనులు, సిమెంట్ రోడ్లు, అంతర్గత మురికి కాలువలు, వైకుంఠ ధామాలు, చెరువుల సుందరీకరణ, లింక్ రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో లింక్ రోడ్ల విస్తరణకు పనులు త్వరలోనే మొదలవుతాయని చెప్పారు.
శరవేగంగా పనులను పూర్తిచేసి వాహనదారుల ఇబ్బందులను తొలగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్ స్వామి, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, హెచ్ఎండీఏ అధికారులు పద్మ, వెంకటరమణ, కౌన్సిలర్లు వెంకటేశ్, రమేశ్ గౌడ్, నాను నాయక్, వెంకటరమణ, నరసింహా రెడ్డి, శ్రీహరిగౌడ్, కో-అప్షన్ సభ్యులు రజిని, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.