విషయంలోనూ భాగ్యనగరం పవర్ఫుల్. నగరం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ వలయం.. గ్రేటర్లో నిమిషమైనా.. చీకట్లను కమ్మనివ్వదు. తెలంగాణ ఏర్పడే నాటికి కనీసం ఐదు మెగావాట్లకు దిక్కులేని స్థితి నుంచి ఇప్పుడు రెప్పపాటు కూడా అంతరాయం ఏర్పడని స్థితికి చేరుకుంది మన మహానగరం. ఒక వేళ నేషనల్ పవర్ గ్రిడ్లో లోపం తలెత్తినా.. ఇక్కడి గ్రేటర్ పవర్ గ్రిడ్తో నగరవ్యాప్తంగా ఒక్క క్షణం కూడా కరెంటు పోవడమనేది ఉండదు. సీఎం కేసీఆర్ ఆలోచన, దూరదృష్టి, కార్యదీక్షతో ఈ అద్భుతం సాధ్యమైంది.
2014లో.. బొల్లారం సబ్స్టేషన్ పరిధిలోని ఒక పరిశ్రమ యజమాని ట్రాన్స్కో ఉన్నతాధికారులను కలిశారు. మూడున్నరేండ్లుగా కేవలం 5 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ కనెక్షన్ కావాలని తిరుగుతున్నాను. ఎలాగైనా నా పరిశ్రమ నిలబడేందుకు సాయం చేయండి… అని అర్థించాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై పెద్ద ఎత్తున మథనం జరిగింది. చివరకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంతో పరిష్కారం కనుగొన్నారు. ఆ పక్కనే షాపూర్నగర్ లో 220 కేవీ సబ్స్టేషన్ ఉంది. దానిని ఐటీ కారిడార్లోని సబ్స్టేషన్లో సమస్య తలెత్తినప్పుడు వినియోగించేందుకు ఏర్పాటు చేశారు. దాని చరిత్ర పరిశీలిస్తే.. ఏడాదిలో ఒక్కసారిగా కూడా దాని అవసరం రాలేదు. వెంటనే దానిని ఇటువైపు మళ్లించాం. ఏకంగా 30-40 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. సదరు పారిశ్రామికవేత్త ఆనందానికి అవధుల్లేవు. 2022లో… అమెజాన్ సంస్థ వాళ్లు వచ్చారు. మహా నగర పరిధిలో మూడు చోట్ల ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్లకు 100-120 మెగావాట్ల చొప్పున కరెంటు కావాలన్నారు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కూడా మూడు చోట్ల ఏర్పాటు చేసే డేటా సెంటర్లకు 180 మెగావాట్ల చొప్పున అడిగారు. వెంటనే ఇస్తాం… నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయండి అని చెప్పాం.
– ట్రాన్స్కో డైరెక్టర్ జగత్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్న అనుభవమిది.
ఇదీ.. తెలంగాణ ఏర్పడితే అంధకారం అలుముకుంటదని శాపనార్థాలు పెట్టిన వారికి చెంపపెట్టులాంటి వివరణ. తెలంగాణ ఏర్పడేనాటికి కనీసం 5 మెగావాట్ల కరెంటుకు దిక్కులేని స్థితి నుంచి ఇప్పుడు హైదరాబాద్ మహానగరం రెప్పపాటు కరెంటు అంతరాయం ఏర్పడని స్థితికి చేరుకున్నది. సీఎం కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే… న్యూయార్క్, లండన్, పారిస్ వంటి నగరాల్లో కరెంటు పోవచ్చుగానీ హైదరాబాద్లో మాత్రం పోదు. ఇది అక్షరాలా నిజం.
భారతదేశమంతా ఒక విద్యుత్ గ్రిడ్ దరిమిలా విపత్తు సంభవించి దేశమంతా కరెంటు పోయినా లిప్తపాటులోనే హైదరాబాద్ మహానగర కరెంటు వ్యవస్థ ఆ గ్రిడ్ నుంచి విడిపోయి ప్రత్యేక గ్రిడ్గా కాంతులీనుతూనే ఉంటుంది. సీఎం కేసీఆర్తో పాటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మనసు పెట్టి… మెదడు కరగదీసి… హైదరాబాద్ మహానగరాన్ని ఒక స్వతంత్ర పవర్ ఐలాండ్గా తయారు చేశారు. దక్షిణ భారతదేశంలో ప్రథమంగా చారిత్రక హైదరాబాద్కు 1912లో కరెంటు వస్తే… ఇప్పుడు దేశంలో మొట్టమొదటిసారిగా ఇలా స్వతంత్ర పవర్ ఐలాండ్ బీఆర్ఎస్ సర్కారు హయాంలో రూపుదిద్దుకొంది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పీక్ అవర్ విద్యుత్ డిమాండ్ 2200 మెగావాట్లు ఉంటే ప్రస్తుతం 3400 మెగా వాట్ల దాకా ఉంది. అంతేకాదు… ఇప్పటికిప్పుడు 6000 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసే సామర్థ్యం హైదరాబాద్ ఐలాండ్ పరిధిలో అందుబాటులో ఉంది. అందుకే వ్యాపారవర్గాలు ఇన్వర్టర్లు, జనరేటర్లను మరిచిపోయాయి. పారిశ్రామికవర్గాలు కరెంటు దిక్కు చూడటం మానేసి పరిశ్రమల విస్తరణలో నిమగ్నమయ్యాయి. మొత్తంగా… అంతర్జాతీయ కంపెనీలు పొరుగు రాష్ర్టాల విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని హైదరాబాద్ మహానగరంతో పోల్చి చూస్తుండటంతో ఈ నగరం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంలా తయారైంది.
రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే తెలంగాణ ప్రభుత్వం కరెంటు సమస్యను పరిష్కరించింది. రాష్ర్టానికే గుండెకాయలాంటి మహానగరంలో 24 గంటల కరెంటు సరఫరాతో పాటు విద్యుత్ ఐలాండ్ ఏర్పాటు కోసం ఏమాత్రం ఖర్చుకు వెనుకాడలేదు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో రాష్ట్రం ఏర్పడేనాటికి ఒక్క 400 కేవీ సబ్ స్టేషన్ లేదంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా మూడు 400 కేవీ సబ్స్టేషన్లతో పాటు అదనంగా ఏడు 220 కేవీ, పదమూడు 132 కేవీ సబ్స్టేషన్లను ఏర్పాటు చేసింది. వీటికి అనుగుణంగా 3269.625 సర్క్యూట్ కిలోమీటర్ల మేర కొత్త లైన్లను వేసింది. పవర్ ట్రాన్స్ఫార్మర్లు, సరఫరా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు ట్రాన్స్కో రూ.4,349.14 కోట్లు ఖర్చు చేసి పటిష్టమైన విద్యుత్ ఐలాండ్ను రూపొందించింది. ఇందుకు అనుగుణంగా సరఫరా, ఇతరత్రా వ్యవస్థల ఏర్పాటు కోసం డిస్కం వెచ్చించిన వ్యయాన్ని జోడిస్తే ఈ మొత్తం రూ.12వేల కోట్ల నుంచి 13వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
సాధారణంగా భారతదేశమంతా ఒక విద్యుత్ గ్రిడ్. ఈ క్రమంలో ఎక్కడ ఏ అవాంతరం తలెత్తినా గ్రిడ్లో సమస్య తలెత్తుతుంది. 2012లో గ్రిడ్ వైఫల్యంతో ఉత్తర భారతమంతా అంధకారంలో మునిగిపోయింది. అదృష్టవశాత్తు దక్షిణ భారతంలో సమస్య తలెత్తలేదు. కొన్నిరోజుల కిందట ముంబై మహానగర గ్రిడ్లో వైఫల్యం తలెత్తి నగరమంతా చీకటిమయమైంది. ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు కరెంటు లేకపోవడమే కాదు… కీలకమైన తాగునీరు, పాల వంటి సరఫరాతో పాటు ఇతరత్రా కనీస సేవలు నిలిచిపోయి భయానక పరిస్థితులు నెలకొంటాయి. అందుకే హైదరాబాద్ మహానగరానికి ఇలాంటి విపత్తు రాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఐలాండ్ను ఏర్పాటు చేశారు.
విద్యుత్ ఫ్రీక్వెన్సీని హెర్జ్ల్లో కొలుస్తారు. గ్రిడ్ వైఫల్యం చెందకుండా ఉండాలంటే 50.05 – 49.90 హెర్జ్ మధ్యలో ఫ్రీక్వెన్సీ నిర్వహణ ఉండాలి. విద్యుత్ సరఫరా – డిమాండ్ మధ్య తేడా భారీగా ఉండకుండా చూడాలి. ఈ క్రమంలో ఫ్రీక్వెన్సీ 49.90 నుంచి పడిపోయి… 47.90 హెర్జ్కు వచ్చిందంటే వెంటనే గ్రిడ్ బ్లాకౌట్ అవుతుంది. 2012లో జరిగింది కూడా ఇదే.
అందుకే గ్రేటర్ పవర్ గ్రిడ్ను నేషనల్ గ్రిడ్తో పాటు మరో మూడు పవర్ ప్రాజెక్టులకు అనుసంధానించారు. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ – భూపాలపల్లి, సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ – మంచిర్యాల, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ – రామగుండం. ఈ మూడు పవర్ ప్రాజెక్టుల స్థాపిత విద్యుత్ సామర్థ్యం సుమారు 3,700 మెగావాట్లు. వీటిల్లో సగటున 80 పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. తద్వారా మూడు ప్రాజెక్టుల నుంచి సుమారు 2,960 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. దీంతో సుమారు 2,916 మెగావాట్ల డిమాండు ఉన్న ప్రాంతాలకు విద్యుత్ను సరఫరా చేసే వీలవుతుంది.
ఒకవేళ భారతదేశ పవర్ గ్రిడ్లో లోపం తలెత్తగానే… క్షణాల్లో గ్రేటర్ పవర్ గ్రిడ్ యాక్టివేట్ అవుతుంది. అంటే వెంటనే నేషనల్ పవర్ గ్రిడ్ నుంచి ఈ గ్రిడ్ పూర్తిగా వేరవుతుంది. ఆ వెంటనే పైమూడు పవర్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ సరఫరా అవుతూ ఈ ఐలాండ్ స్వతంత్రంగా పని చేస్తుంది.
తద్వారా హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఒక్క క్షణం కూడా కరెంటు పోవడమనేది ఉండదు. ఇదే కాదు… కృష్ణా, గోదావరి నుంచి నగరానికి తాగునీటి సరఫరా జరుగుతున్న దరిమిలా కృష్ణాజలాలను తరలింపులో భాగంగా ఏర్పాటు చేసిన నాలుగు నీటి శుద్ధి కేంద్రాలు, గోదావరి జలాల తరలింపునకు నిర్మించిన మరో ఆరు నీటి శుద్ధి కేంద్రాలు, శివారులోని కీలకమైన దవాఖానలు, ప్రధాన పాయింట్లను కూడా ఈ ఐలాండ్కు అనుసంధానించారు. దీంతో కేవలం నగరవ్యాప్తంగా కరెంటు ఉండటమే కాకుండా తాగునీరు, ఇతరత్రా సేవలకు కూడా కించిత్తు ఆటంకం కలగదు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్డు వ్యవస్థకు అనుగుణంగా విద్యుత్ ఐలాండ్లను కూడా ఏర్పాటు చేశారు. నగరం చుట్టూ ఇన్నర్ రింగు రోడ్డు, ఔటర్ రింగు రోడ్డు ఉంది. ఆపై రీజినల్ రింగు రోడ్డు రానుంది. ఇలానే… గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ ఐలాండ్ను నగర కేంద్రంగా చుట్టూ 25 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా నగరానికి చుట్టూ మరో 80-100 కిలోమీటర్ల పరిధిలో ఒకటి, 180-200 కిలోమీటర్ల పరిధిలో మరో ఐలాండ్ను ఏర్పాటు చేశారు. అంటే నగరం చుట్టూ మూడు విద్యుత్ ఐలాండ్ (విద్యుత్ వలయాలు) ఏర్పాటయ్యాయి.
2009 సంవత్సరంలో జీహెచ్ఎంసీ ఏర్పాటైంది. తెలంగాణ ఏర్పడేనాటికి ఉప్పల్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో మౌలిక వసతులు లేవు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఊహించనిరీతిలో జీహెచ్ఎంసీలో విలీనమైన ప్రాంతాలే కాదు… రాష్ట్రవ్యాప్తంగానూ విద్యుత్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చింది. దీంతో శివారు ప్రాంతాలు శరవేగంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా జరుగుతుంది.