మన్సూరాబాద్, డిసెంబర్ 24: ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. త్వరలోనే మీ ఆకాంక్షను విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఎల్బీనగర్, మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఎంఈరెడ్డి గార్డెన్లో శనివారం ఎస్టీయూటీఎస్ (స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్) వజ్రోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తన్నీరు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హాజరై సీపీఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు ఎస్టీయూటీఎస్ రూపొందించిన ప్రత్యేక సంచిక, సంఘం నూతన సంవత్సర డైరీ, తెలంగాణ జాతి రత్నాలు, 2023 క్యాలెండర్, 2023 జీఓల పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ… 75 ఏండ్లు పూర్తి చేసుకున్న ఒకేఒక సంఘం ఎస్టీయూటీఎస్ అని, టీచర్ల సమస్యలు పరిష్కరించడంలో ఆ సంఘం కృషి అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూళ్లను రద్దు చేసినప్పటికీ, అంగన్వాడీల బడ్జెట్కు సగం మేర కోత పెట్టినప్పటికీ వాటిని యథావిధిగా కొనసాగిస్తున్నామని, మరింత బలోపేతం చేశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 298 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉంటే ఇప్పుడు వాటిని 1201కి పెంచామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లకు 390 కోట్లు ఖర్చు పెడితే స్వరాష్ట్ర పాలనలో 3250 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014-15 బడ్జెట్లో విద్య కోసం 9250 ఖర్చు పెడితే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో 25 వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ నుంచి వైద్య విద్య, నర్సింగ్, బీఫార్మసీ,పారా మెడికల్ కోర్సులతో పాటు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశామని తెలిపారు.
ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్న కేంద్రం..
తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నదని మత్రి హరీశ్ రావు అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల ఎఫ్ఆర్బీ నిధుల్లో కోత పెట్టిందన్నారు. బోరు బావి వద్ద మీటర్ పెట్టమన్నందుకు రెండేండ్లలో 12 వేల కోట్ల నిధులు మన రాష్ర్టానికి రాకుండా కేంద్ర ప్రభుత్వం చేసిందని తెలిపారు. 15వ ఫైనాన్స్ కమిషన్ 5 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని సూచించినప్పటికీ కేంద్రం ఇవ్వకుండాఉద్దేశపూర్వకంగా ఆపిందని ఆరోపించారు. రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన 40 వేల కోట్లను రెండేండ్లుగా కేంద్రం నిలిపివేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏమి ఆచరిస్తదో, దేశం అదే ఆచరిస్తది అనే అంత గొప్పగా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) అధ్యక్షుడు జి. సదానందం గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.పర్వత్రెడ్డి, సంఘం మాజీ అధ్యక్షులు బి. భుజంగరావు, బి.నరేంద్రరెడ్డి, ఆర్థిక కార్యదర్శి బి. రవి, ఏఐఎస్టీఎఫ్ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు పి.బ్రహ్మచారి, ఎస్టీయూఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న, మాజీ అసోసియేట్ అధ్యక్షురాలు డి.కమలారెడ్డి, సభ్యులు కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల కృషి అభినందనీయం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కరోనా కష్ట కాలంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. టీచర్ల ప్రమోషన్లు, బదిలీల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ తెలిపారని చెప్పారు. సీఎం విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు ఒకరికొకరు సహకరించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుందామన్నారు.
విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు సహకరించాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
సమాజ నిర్మాణ కోసం ఎస్టీయూటీఎస్ సంఘం ఏర్పడిందని విశ్వసిస్తున్నానని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. విద్యారంగ అభివృద్ధికి ఎస్టీయూటీఎస్ లాంటి సంఘం ఇస్తున్న సలహాలు, సూచనలు ప్రభుత్వం పాటిస్తుందని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వాములై విద్యావ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వానికి సంఘాలు సహకరించాలన్నారు. దేశంలోని ఉపాధ్యాయ సంఘాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి పాఠశాల విద్య, హైస్కూల్ విద్య ఎలా ఉండాలనే దానిపై ఒక సమగ్రమైన చర్చకు ఆస్కారం ఇచ్చే విధంగా ఎస్టీయూటీఎస్ చొరవ చూపాలన్నారు.
సమస్యల పరిష్కారంలో ఎస్టీయూటీఎస్ కృషి అభినందనీయం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సామరస్య పూర్వకంగా పరిష్కరించడంలో ఎస్టీయూటీఎస్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సమస్యల కోసం పోరాటం చేస్తూనే విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సంఘం చర్యలు చేపట్టిందన్నారు.