సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ఏర్పాటు చేసే లేఅవుట్ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత సమయంలో సమగ్ర మౌలిక వసతులతో లేఅవుట్ను అభివృద్ధి చేసి అప్పగిస్తారన్న మంచి పేరు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కి ఉంది. ఇప్పటికే నగరంలో పలు చోట్ల అభివృద్ధి చేసిన లేఅవుట్లే అందుకు నిదర్శనం. అలాంటి హెచ్ఎండీఏ బహదూర్పల్లి, బాచుపల్లిలో ప్రతిపాదించిన లేఅవుట్లు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రభుత్వం మారడంతో అందులో ప్లాట్లు ఉన్న వారు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థగా హెచ్ఎండీఏ వెంచర్లో ప్లాట్లు అని లక్షలు చెల్లించి కొనుగోలు చేశాం.. నెలలు గడుస్తున్నా లేఅవుట్లలో చేపట్టాల్సిన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీరు వంటి మౌలిక వసతులను కల్పించడం లేదు. బహదూర్పల్లిలో 40ఎకరాల విస్తీర్ణంలో, అదేవిధంగా బాచుపల్లిలో 27 ఎకరాల్లో ప్రతిపాదించిన లేఅవుట్లలో ప్లాట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించింది. ఆ తర్వాత ఆ రెండు లేఅవుట్లలో చేపట్టాల్సిన లేఅవుట్ అభివృద్ధి పనులు మాత్రం ఇప్పటికీ చేపట్టడం లేదు. కేవలం బుద్వేల్, మోకిల లేఅవుట్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన హెచ్ఎండీఏ వాటిని ఒకే కంపెనీకి సుమారు రూ.400 కోట్లకు అప్పగించింది. అదేసమయంలో బహదూర్పల్లి, బాచుపల్లిలోని లేఅవుట్లలో అభివృద్ధి చేసేందుకు పిలిచిన టెండర్లను మాత్రం రద్దు చేశారు. దీంతో ఆ రెండు లేఅవుట్లలో పాట్లను కొనుగోలు చేసిన యజమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి హెచ్ఎండీఏ పరిధిలో అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. గతేడాది ఎన్నికల కోడ్ మూలంగా నవంబర్, డిసెంబర్ నెలల నుంచే అభివృద్ధి పనులు నిలిచిపోగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టింది. గతమెంతో ఘనం అన్నట్లుగా ఉండే హెచ్ఎండీఏలో ఇప్పుడు అంతా గప్ చుప్ అన్నట్లుగా ఎక్కడి వారు అక్కడే ఉన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, పనుల్లో మాత్రం చలనం లేదు. నగర శివారు ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన, రోడ్లు, ఫ్లై ఓవర్ల వంటి నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4నెలలు గడుస్తున్నా క్షేత్ర స్థాయిలో ప్రతిపాదిత ప్రాజెక్టులపై దృష్టి సారించడం లేదు. ముఖ్యంగా హెచ్ఎండీఏ లేఅవుట్లలో ప్లాట్లను ఆన్లైన్లో వేలం ద్వారా విక్రయించి సొమ్ము చేసుకున్నా, క్షేత్ర స్థాయిలో లేఅవుట్లో మాత్రం కనీస సౌకర్యాలైన రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులను ఎందుకు కల్పించడం లేదంటూ కొనుగోలు దారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా హెచ్ఎండీఏ అధికారులు స్పందించి బహదూర్పల్లి, బాచుపల్లిలోని లేఅవుట్లను అభివృద్ధి చేసి తమకు అప్పగిస్తే అక్కడ గృహ నిర్మాణాలు చేసుకుంటామని కొనుగోలు దారులు అభిప్రాయపడుతున్నారు.