సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల హద్దుల నిర్ధారణ సాగుతూనే ఉంది. గతేడాది డిసెంబర్ నాటికే ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినా..ప్రక్రియలో పురోగతి లేకుండా పోయింది. ఒక్కో చెరువుకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారించడానికి నెలల గడువు తీసుకోవడం ప్రక్రియ అనుకున్నంత వేగంగా సాగడం లేదు. దీంతో నగరంలో చెరువుల పరిరక్షణ పేరిట సర్కారు చేస్తున్న హడావుడి, హెచ్ఎండీఏలో జరుగుతున్న హద్దుల నిర్ధారణ తీరుతోనే తేలిపోతుంది.
పదకొండు జిల్లాల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ 2,978కి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణ, నిర్వహణ, పరిరక్షణ, ఆధునీకరణ కార్యకలాపాలను హెచ్ఎండీఏనే చేపడుతుండగా.. చెరువు హద్దులను కాపాడటం కూడా హెచ్ఎండీఏ బాధ్యతనే. 2013 నుంచి 2023 నాటికి సుమారు 1,683 చెరువులకు ప్రాథమిక హద్దు రాళ్ల ప్రక్రియ పూర్తైంది. మిగిలిన వాటిలో 1,295 చెరువులకు మాత్రమే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ నిర్ధారణ జరిగినట్లుగా తేలింది.
ఈ క్రమంలో చెరువులను పరిరక్షించడంలో కీలకమైన బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ఎందుకు ఖరారు చేయాలని హెచ్ఎండీఏను ప్రశ్నించి, గతేడాది నవంబర్ నెల వరకు మిగిలిన 1000 చెరువులకు హద్దులను నిర్ధారించాలని ఆగస్టులో తెలంగాణ హైకోర్టును ఆదేశాలు జారీ చేసింది. కానీ హెచ్ఎండీఏ అధికారులు ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం చెరువులు, ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో ఉన్న ఆక్రమణల లెక్కలను వెలికి తీయలేకపోయింది. తుది జాబితా తయారు అసాధ్యంగా మారడంతో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటుందే తప్ప..ప్రక్రియను పూర్తి చేయడం లేదు.
హెచ్ఎండీఏ గుర్తించిన చెరువులకు నిర్ణీత గడువులోగా హద్దుల నిర్ధారణ చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా గడిచిన కొన్నేళ్లుగా రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ విభాగాల మధ్య సమన్వయం లోపం తీవ్రంగా ఉంది. బఫర్ జోన్ నిర్ధారించడానికి హెచ్ఎండీఏ, ఇరిగేషన్ మ్యాపులకు పొంతన లేకపోవడంతో హద్దుల నిర్ధారణపై అధికారులకు సాకుగా మారింది.