మియాపూర్/శేరిలింగంపల్లి, డిసెంబర్26: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు సర్కిల్ వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చందానగర్ సర్కిల్ డీసీ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ప్రభుత్వం ప్రకటించిన ‘ఆరు గ్యారంటీ’ల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రకటించిన షెడ్యూల్ వారీగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించనున్న ‘ప్రజా పాలన’పై అధికారులతో డీసీ తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో 4 వార్డులకుగాను మొత్తం 64 కేంద్రాల్లో చేయూత, మహాలక్ష్మీ, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి పథకాలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలన్నారు. ఇప్పటికే తేదీల వారీ గా ఏ కాలనీ ఏ తేదీన ఎక్కడ దరఖాస్తు సమర్పించాలో క్షేత్రస్థాయిలో మహిళా సంఘాల ద్వారా తెలియపరిచినట్లు డీసీ వంశీ తెలిపారు. అన్ని పథకాలకు ఒకే దరఖాస్తు ఉంటుందని తగు పత్రాలతో సంబంధిత కేంద్రం లో అందించాలని ఆయన ప్రజలకు సూచించారు. వార్డు ల వారీగా అధికారులు ప్రజాపాలన దరఖాస్తు ప్రక్రియపై తగు పర్యవేక్షణ చేపట్టాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని డీసీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో’ప్రజా పాలన’ కార్యక్రమ నిర్వాహణకు సంబంధించి శేరిలింగంపల్లి స్పెషల్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ వాణీశ్రీ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్కిల్ ఉప కమిషనర్ రజనీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.సర్కిల్ పరిధిలో గచ్చిబౌలి, కొండాపూర్, శేరిలింగంపల్లి మూడు డివిజన్లలో 12 కేంద్రాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతున్నదని ఆమె వెల్లడించారు. ఈనెల 31, జనవరి 1వ తేదీల్లో ‘ప్రజా పాలన’ ఉండదని ప్రజల గమనించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్, డిసెంబర్26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ప్రజా పాలన’కు అధికారులు సంసిద్ధం కావాలని డిప్యూటీ కమిషనర్ సేవా ఎస్లావత్ పేర్కొన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు యూసుఫ్గూడ సవేరా ఫంక్షన్ హాల్లో జీహెచ్ఎంసీ 19వ సర్కిల్ నోడల్ అధికారి శైలజ అధ్యక్షతన ‘ప్రజా పాలన’ బృందాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయా బృందాలు ప్రతిరోజు నిర్ధేశిత ప్రాంతాల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. యూసుఫ్గూడ సర్కిల్లో 5 వార్డులకుగానూ 24 కమిటీలను ఏర్పాటుచేశారు.
‘ప్రజా పాలన’ కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని బుధవారం యూసుఫ్గూడ చెక్పోస్ట్ ఫస్ట్ పోలీస్ బెటాలియన్లోని మంజీరా కమ్యూనిటీ హాలులో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో అన్ని డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొంటారని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాజ్కుమార్, ఏఈఆర్ఓ బాల్రాజు, తహసీల్దార్ నయీముద్దీన్, ఎఎంఓహెచ్ డాక్టర్ రవి, యూసీడీ పీఓ హిమబిందు, డిప్యూటీ ఈఈలు శ్రీరాములు, రామచంద్రరాజు పాల్గొన్నారు.