Telegram | సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): టెలిగ్రామ్.. వాట్సాప్ అడ్డాగా బాధితులను, ఖాతాదారులను సైబర్నేరగాళ్లు ఎంచుకుంటున్నారు. ఇందులో కొన్ని సందర్భాల్లో బాధితులే బ్యాంకు ఖాతాలు సరఫరా చేసే కమీషన్ ఏజెంట్లుగా మారుతున్నారు. ప్రధాన సూత్రదారులకు ఇలాంటి కమీషన్ ఏజెంట్లతో ఫోన్ సంభాషణలు ఉండవు. కేవలం టెలిగ్రామ్, వాట్సాప్లలో చాటింగ్ చేసుకొని వివరాలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ సంభాషణలు ఎక్కడి నుంచి జరిగాయి.. ఎవరెవరు పాల్గొన్నారనే సమాచారాన్ని పూర్తిస్థాయిలో లభించదు. దీంతో ఈ యాప్ల నుంచి చాట్ చేస్తున్న సైబర్నేరగాళ్ల పూర్తి సమాచారాన్ని రాబట్టడం సైబర్క్రైమ్ పోలీసులకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకు ఖాతాలే లక్ష్యంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. బ్యాంకు ఖాతాలను కట్టడి చేయాలంటే.. ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సి ఉన్నదని ఇప్పటికే సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు నివేదిక తయారు చేశారు. ఈ నివేదిక ఆధారంగానే బ్యాంకు ఖాతాలను కట్టడి చేయడంపై సుదీర్ఘంగా బ్యాంకింగ్ అధికారులు, సైబర్క్రైమ్ పోలీసులు చర్చించనున్నారు.
పార్ట్టైమ్ ఉద్యోగులు కావాలంటూ మొదట వాట్సాప్, ఫేస్బుక్లలో ప్రకటనలు ఇవ్వడం.. వాటికి ఆకర్షితులైన వారితో చాట్ చేయడం, ఫోన్లో మాట్లాడి టెలిగ్రామ్ గ్రూప్లో చేర్చుతుంటారు. టెలిగ్రామ్ గ్రూప్లో ఉండే సైబర్నేరగాళ్లు.. బాధితులను మోసం చేసేందుకు ప్లాన్ చేసి, వారికి పార్ట్టైమ్ జాబ్ అంటూ ఆశ చూపి బుట్టలో వేస్తారు. మొదటి మీరు యూట్యూబ్ రివ్యూస్, సబ్స్క్రిప్షన్ చేయండి.. మేం ఓ క్లిక్కు రూ. 50 ఇస్తామంటూ నమ్మకం కుదిరిస్తారు. ఇందుకు బాధితులకు లాభాల పేరుతో కొంత డబ్బు కూడా పంపిస్తారు.ఆ తరువాత నమ్మిన వారితో వేలు, లక్షలు పెట్టుబడిగా పెట్టించి ముంచేస్తుంటారు.
పెట్టుబడులపై మీకు నమ్మకం లేకపోతే.. మీ దగ్గర బ్యాంకు ఖాతా ఉంటే ఇవ్వండి.. మేం ఆ ఖాతాను ఉపయోగించుకుంటాం.. డిపాజిట్ అయిన డబ్బులో నుంచి 10 శాతం కమీషన్ ఇస్తాం.. మేమంతా లీగల్గా బిజినెస్ చేస్తున్నామంటూ.. బాధితులకు మాయమాటలు చెప్పి నమ్మిస్తున్నారు. చాలామంది 10 శాతం కమీషన్ ఆశతో బ్యాంకు ఖాతాను సైబర్నేగాళ్లకు అందిస్తుంటారు. ఈ బ్యాంకు ఖాతాలను రెండు మూడు రోజులు ఉపయోగించి.. రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు లావాదేవీలు జరుపుతారు. అప్పటికే ఎవరో ఒకరు 1930కు ఫోన్ చేయడంతో ఆ ఖాతా ఫ్రీజ్ అవుతుంది. అప్పటికే సైబర్నేరగాళ్లు ఈ ఖాతాలో డిపాజిట్ అయిన సొమ్మును వారి మరో ఖాతాకు బదిలీ చేస్తున్నారు. అత్యాశకు పోయి సైబర్నేరగాళ్లు వేసే వలకు చిక్కి మోసపోవద్దని, కమీషన్లకు కక్కుర్తిపడి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.