హయత్నగర్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేైండ్లెనా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ‘అమ్మాయి పుడితే ఆర్థిక ఇబ్బందులు, అబ్బాయి పుడితే వారసుడు వచ్చాడు’ అనే భావన ఇప్పటికీ సమాజంలో వేళ్లూనుకుపోయి ఉంది. కొందరు స్కానింగ్ల సహాయంతో కడుపులో ఉన్నది ఆడబిడ్డా, మగబిడ్డా అని తెలుసుకొని.. ఒకవేళ ఆడబిడ్డ అయితే కడుపులోనే చంపేస్తుండగా.. మరికొందరు తీరా ఆడపిల్ల పుట్టాక.. ఆ పసికందును అంగట్లో పెట్టి డబ్బులకు అమ్మేసుకుంటున్నారు.
సరిగ్గా ఇలాంటి ఘటనే అబ్దుల్లాపూర్మెట్ మండలంలో చోటుచేసుకుంది. పోచమ్మ బస్తీకి చెందిన రమేశ్, రేణుక దంపతులకు అప్పటికే ముగ్గురు కూతుర్లు, ఓ కుమారుడు ఉండగా.. ఈనెల 16న రేణుక మరో కూతురికి జన్మనిచ్చింది. పాప తమకు ఆర్థికంగా భారం అవుతుందనే ఉద్దేశంతో ఆ దంపతులు.. కండ్లు కూడా తెరవని ఆ పసికందును అంగట్లో అమ్మకానికి పెట్టారు. విషయం పోలీసులకు తెలవడంతో ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు.
హయత్నగర్, ఆగస్టు 28 : పసికందును విక్రయించిన హృదయ విదారక ఘటనలో నలుగురిపై కేసు నమోదైన ఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం…అబ్దుల్లాపూర్మెట్ మండలం, పెద్దఅంబర్పేట పోచమ్మబస్తీలో నివాసముంటున్న పగడాల రమేష్, రేణుక దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. గత 16న వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో రేణుకకు మరో కూతురు జన్మించింది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరిగా పుట్టిన కూతురును నరేష్ అనే మధ్యవ్యక్తి ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అనగొంటె వెంకటయ్య, లక్ష్మి దంపతులకు పెంచుకోవడానికి దాదాపు లక్షన్నర రూపాయలకు విక్రయించారు. 1098 ద్వారా సమాచారం అందుకున్న ఐసీడీఎస్ హయత్నగర్ ప్రాజెక్టు అధికారిణి ఎ.అనిత, చైల్డ్లైన్ కౌన్సిలర్ జ్యోతిలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విక్రయించిన పసికందును అమీర్పేటలోని శిశువిహార్కు అప్పగించారు. ఐసీడీఎస్, చైల్డ్లైన్ అధికారుల ఫిర్యాదు మేరకు పగడాల రమేష్, రేణు, అనగొంటి వెంకటయ్య లక్ష్మి దంపతులపై హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.