సిటీబ్యూరో, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో శిల్పా చౌదరి సింగపూర్లో ఒక రోజుకు రూ. 30 లక్షలు ఖర్చుపెట్టింది… దీనికి తోడు ఆమె చేతిలో పట్టుకునే బ్యాగు ఖరీదు రూ.50 వేల వరకు ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నా.. ఆమె రోజుకు 5 లక్షలు ఖర్చుపెట్టేది. ఇలా ఆమె విలాసవంతమైన జీవితానికి డబ్బును నీళ్లలాగా ఖర్చు చేసిన వైనం పోలీసులనే నివ్వెరపరుస్తున్నది. రెండోసారి కస్టడీలో వెలుగు చూసిన అంశాలతో దర్యాప్తులో వేగం పెంచారు. సంపన్న మహిళలు, వ్యాపారస్తులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించి.. దాదాపు రూ. 90 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఇప్పుడు శిల్పా చౌదరితో అక్రమ మార్గాల్లో నల్లధనాన్ని మార్పించుకునేందుకు ప్రయత్నించిన వారందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.