కుత్బుల్లాపూర్,డిసెంబర్26: విద్యుత్ వైర్లు తగిలి కంటైనర్ లారీ దగ్ధం కాగా డ్రైవర్, క్లీనర్ తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఎంహెచ్05 ఎఎం3432 అనునంబర్ గల కంటైనర్ ఖాళీ లారీ డ్రైవర్ ఎండీ ఖరీం, క్లీనర్ ఎండి రిద్వాన్లు మేడ్చల్లోని ఓ కంపెనీ గోడోన్ నుంచి సామగ్రిని తీసుకునేందుకు వచ్చారు.
మేడ్చల్ కండ్లకోయం ఆర్వీఎం మాల్ సమీపంలో మేడ్చల్ నుంచి కొంపల్లి వైపునకు యూటర్న్ చేసుకునే క్రమంలో డ్రైవర్ ఖరీం అతివేగం, నిర్లక్ష్యంగా ఒక్కసారిగా లారీ టర్న్ కాలేదు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లడంతో విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్లు కంటైనర్ పైభాగానికి తగిలాయి. అప్పటికే అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్లకు కరెంటు షాక్ తగిలినప్పటికీ తేరుకొని బయటదూకడంతో ప్రాణాలు కాపాడుకోగలిగారు. విద్యుత్షాక్తో మంటలు చెలరేగి కంటైనర్ లారీ దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.