ఖైరతాబాద్ : స్వరాష్ట్ర సృష్టికర్త, జలయజ్ఞ ప్రధాత, బంగారు తెలంగాణ నిర్మాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పీవీ మార్గ్ లోని పీపుల్స్ప్లాజా వద్ద ఒడిషాకు చెందిన కళాకారుడు సత్యనారాయణ రూపొందించిన సైకత శిల్పాన్ని హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి వీక్షించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలను తలపించేలా నేడు దేశ, విదేశాల్లో సీఎం జన్మదిన వేడుకలు జరుగుతున్నాయన్నారు. ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ఆయన నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాలు, అవసరాలను ముందే తెలుసుకొని పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశం మెచ్చే నేతగా విరాజిల్లుతున్నారన్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో విశ్వనగరం హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆయూరారోగ్యాలతో నిండునూరేళ్లు వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.