కొండాపూర్, జనవరి 17 : పని చేస్తున్న ఇంటికే కన్నం వేసి.. బంగారు నగలతో పాటు నగదును అపహరించిన ముఠాను కొల్లూరు పోలీసులు, మాదాపూర్ ఎస్ఓటీ బృందం సంయుక్త ఆపరేషన్లో అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వినిత్ వివరాలను వెల్లడించారు.
ఉస్మాన్నగర్ ముప్పా ఇంద్రప్రస్త హోమ్స్ విల్లా 188లో నివాసం ఉండే ముల్కల సుజాత గతేడాది డిసెంబర్ 21న వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన పని మనిషి, ఒడిశాకు చెందిన ప్రభాకర్ మాలిక్ (28) పథకం ప్రకారం తనతో పాటు మరో ముగ్గురు తపన్దాస్(32), సచ్ఛింద్ర దాస్ (48), రతికాంత దాస్(26)తో కలిసి ఇంట్లో దాచిన 75 తులాల బంగారు నగలతోపాటు రూ. 6.50లక్షల నగదు తీసుకొని ఉడాయించారు.
ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన సుజాత పర్సనల్ అసిస్టెంట్ జనవరి 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జనవరి 15న ప్రభాకర్ మాలిక్తో పాటు మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి 96.3తులాల బంగారు నగలు, రూ. 2.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
దొంగతనానికి పాల్పడిన ముఠాను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి, మియాపూర్ ఏసీపీ నరసింహారావు, సీసీఎస్ ఏసీపీ శశాంక్రెడ్డి, కొల్లూరు ఎస్హెచ్ఓ రవీందర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.