బడంగ్పేట/కందుకూరు, ఫిబ్రవరి 2: బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పని చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్లో ఇంటి పన్నులు తగ్గించే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకొని పోయి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గురువారం రాత్రి జిల్లెలగూడ క్యాంపు కార్యాలయంలో మీర్పేట కార్పొరేషన్లో ఉన్న ఇంటి పన్నుల గురించి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. గతంలో ఉన్నదానికంటే ప్రస్తుతం ఇంటి పన్నులు ఎంత పెరిగాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మీర్పేట కార్పొరేషన్లో 19,500 ఇండ్లకుగాను 14 వేల ఇండ్లకు పాత పద్ధతిలోనే ఇంటి పన్నులు చెల్లిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రెండు దఫాలుగా భూముల ధరలు పెరగటం వలన జియోట్యాగ్ చేశామన్నారు. 4 వేల ఇండ్లకు మాత్రమే ఇంటి పన్నులు పెరిగాయని, కాలనీల అసోసియేషన్లు, నాయకులు, మేయర్, డిఫ్యూటీ మేయర్, కార్పొరేటర్లతో మాట్లాడి అన్ని వివరాలు తీసుకున్న తరువాతనే కొత్తగా ఇంటి పన్నులు పెరిగిన 4 వేల ఇండ్లకు ప్రస్తుతం పన్నులు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు.
ప్రజల సమస్యలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ పాలకవర్గం ఇంటి పన్నులు తగ్గించాలని ఒక నిర్ణయం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేయాలని మంత్రి ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తేనే ఇంటి పన్నులు తగ్గించారని అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎప్పుడైనా.. ఎక్కడైనా ప్రజల సమస్య వచ్చినప్పుడు స్పందించవలసిన బాధ్యత తమకు ఉందన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తానికే మొత్తం పెంచినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్తారని మంత్రి అన్నారు.
కాంగ్రెస్ నాయకులు గత 4 సంవత్సరాల నుంచి ఇంటి పన్నుల గురించి ఎందుకు ఆలోచన చేయలేదు, ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆర్భాటాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డిఫ్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ సీ.ఎచ్ నాగేశ్వర్, బీఆర్ఎస్ పార్టీ అద్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి, కార్పొరేటర్లు అర్కల భూపాల్రెడ్డి, పవన్, అనిల్ కుమార్, నవీన్గౌడ్, ముద్ద పవన్కుమార్, బీఆర్ఎస్ నాయకులు దీప్లాల్, నర్సిరెడ్డి, కాలనీ అసోసియేషన్ నాయకులు తదితరులు ఉన్నారు.
అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదు
అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని గూడూరు గ్రామంలో శ్రీ వేంకటేశ్వర దేవస్థానం వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదని, రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలకు నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.
శ్రీశైలం ఫార్మా రోడ్డు నుంచి గూడూరు గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.60 లక్షలు మంజూరు చేస్తున్నామని, త్వరలో పనులను ప్రారంభించాలని కోరారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలకు కావాల్సిన నిధులను మంజూరు చేసి పనులను సకాలంలో పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో రాజీపడకుండా అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నామని, అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు లక్ష్మీనర్సింహరెడ్డి, దశరథ ముదిరాజ్, సర్పంచ్ శ్రీలత, ఎంపీటీసీలు ఎల్లారెడ్డి, ఇందిరమ్మ దేవేందర్, యువనాయకులు తాళ్ల కార్తీక్, విజ్ఞేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.