సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి/మారేడ్పల్లి/బొల్లారం : కంటోన్మెంట్ ఎమ్మెల్యే జ్ఞాని సాయన్న ఆకస్మిక మరణాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నియోజకవర్గం ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం ఉదయం 11:15గంటలకు సాయన్న పార్థివదేహాన్ని తన ఇంటి నుంచి కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ప్రజల సందర్శనార్ధం తరలించారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజలకు సేవ చేసిన సాయన్నను కడసారిగా చూసేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. ‘సాయన్నా.. నీ మేలు మరువం’, ‘పేదల పెన్నిది సాయన్న’ నినాదాలతో క్యాంప్ కార్యాలయం హోరెత్తింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సాయన్న సోదరి మల్కమ్మ, కుటుంబీకులు భోరున విలపించడంతో అక్కడున్నవారు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అశ్రునయనాలతో ఎమ్మెల్యే సాయన్న అంతిమయాత్ర మధ్యాహ్నం 3:25 గంటలకు కార్ఖాన గృహలక్ష్మికాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైంది. అంతిమయాత్ర పొడవునా ఎమ్మెల్యే సాయన్నకు జోహార్లు, అమర్ రహే ఎమ్మెల్యే సాయన్న అంటూ అభిమానులు నినాదాలు చేశారు. కాగా అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలని సాయన్న అభిమానులు, దళిత సంఘాల నేతలు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో సాయన్న కూతురు నివేదిత ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పడంతో సాయంత్రం 7గంటలకు ఈస్ట్ మారేడ్పల్లిలోని హిందూ శ్మశానవాటికలో ఎమ్మెల్యే అల్లుడు సూర్యచంద్ర (పెద్ద కుమార్తె భర్త) తలకొరివి పెట్టారు.
ఎమ్మెల్యే సాయన్న సేవలు మరువలేనివని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. సోమవారం ఉదయం కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని సాయన్న భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయన్న కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సాయన్నకు నివాళులర్పించిన వారిలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, ఉప సభాపతి టి.పద్మారావుగౌడ్ ఉన్నారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆకస్మిక మరణం పట్ల బీఆర్ఎస్ మలాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయన్న మరణవార్త తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. సుదీర్ఘకాలం పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్న ఆ ప్రాంత అభివృద్ధి కోసం అకడి ప్రజల క్షేమం కోసం ఎంతో కృషి చేశారన్నారు. బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన సాయన్న రాజకీయాల్లో అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందారన్నారు. సాయన్న ఎంతో ఆప్యాయంగా పలుకరించే వారని, ఆయన సృ్మతులను గుర్తు చేసుకున్నారు. ఆయన లేనిలోటు పూడ్చలేనిదని సాయన్న పవిత్ర ఆత్మకు శాంతిచేకూర్చాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సోమవారం అశోక్నగర్లో సాయన్న పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. సాయన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐదు పర్యాయాలు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాయన్న చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. పేదల సంక్షేమం కోసం సాయన్న ఎప్పుడూ పరితపించే వారని, కంటోన్మెంట్ అభివృద్ధిలో తనదైన ముద్రవేశారని తెలిపారు.
ఉదయం 10గంటలకు సాయన్న భౌతిక దేహానికి చివరిసారిగా చూసి నివాళులర్పించడానికి అశోక్నగర్లోని ఆయన నివాసం వద్దకు మంత్రులు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ముదిరాజ్, శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు సబితారెడ్డి, ఇంద్ర కరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్రెడ్డి, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, తదితరులు నివాళులర్పించారు.
రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, దానం నాగేందర్, మాధవరం కృష్ణారావు, జైపాల్యాదవ్, కేపీ వివేకానంద్, మైనంపల్లి హన్మంతరావు, మాగంటి గోపీనాథ్, జాజుల సురేందర్, గువ్వల బాలరాజు, ఈటల రాజేందర్ నివాళులర్పించారు.
బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కిశాంక్ మన్నె, విద్యా మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్, తదితరులు నివాళులర్పించారు.
ఎమ్మెల్సీలు నివాళి ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, ఎల్.రమణ, బుగ్గారపు దయానంద్గుప్తా, తదితరులు నివాళులర్పించారు.
మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ చైర్మన్ డాక్టర్ బానోత్ రమణానాయక్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, రాంచందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు శంకర్రావు, తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, జి.వివేక్ వెంకటస్వామి, అల్లాడి రాజ్కుమార్, బీఆర్ఎస్ నేతలు మర్రి రాజశేఖర్రెడ్డి, ఎంఎన్ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ, అద్దంకి దయాకర్, బీజేపీ నేతలు, బండా కార్తికారెడ్డి, గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్, మాలమహానాడు జి.చెన్నయ్య, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ, కంటోన్మెంట్ సీఈవో మధుకర్నాయక్తోపాటు పలు డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు సాయన్న పార్థివదేహానికి నివాళులర్పించారు.