అమీర్పేట్, నవంబర్ 7: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అభివృద్ధిపై దృష్టి సారిస్తే నియోజకవర్గాన్ని ఎంతలా అభివృద్ధి చేయవచ్చనే విషయాన్ని సనత్నగర్ సాధించిన ప్రగతిని పరిశీలిస్తే తెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. నియోజకవర్గ చరిత్రలో చుట్టపు చూపులా వచ్చిపోయే నాయకులే తప్ప, అభివృద్ధిపై పూర్తి స్థాయి దృషి సారించిన నాయకులే లేకుండా పోయారన్నారు.
మంగళవారం సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి అధ్యక్షతన 60 ఫీట్రోడ్డు, డీఎన్ఎం కాలనీలలో జరిగిన కార్యక్రమాల్లో స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీలో చేరిన యువకులకు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 1400 కోట్లు వెచ్చించామని, చేసిన అభివృద్ధి చూస్తే అర్థమవుతుందన్నారు. అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ప్రజలు బీఆర్స్ పార్టీకి అండగా నిలవాలన్నారు. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు.